ప్రకాశం జిల్లా చీరాల లో వింత పరిస్థితి నెలకొంది. అధికార విపక్షాల మధ్య జరుగుతున్న చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి గాలివానగా మారే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజా నాయకుడిగా పేరున్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందిన తరవాత ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు కాస్తంత అదుపు తప్పాయి అనేది వాస్తవమే. జర్నలిస్టు కూడా కానీ ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకుని సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరాం ఆడుతున్న నాటకం మొత్తం బయట పెట్టే ప్రయత్నం చేస్తున్న ఆమంచికి ఇతర జర్నలిస్ట్ సంఘాలు కూడా మద్దతు తెలుపుతూ ఉండడం విశేషంగా కనిపిస్తోంది.
" ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్న చంద్రబాబు ఇప్పుడు చచ్చిన పాముగా బతుకుతున్నాడు .. నా వయసులో చంద్రబాబు ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలో వంగవీటి రంగా మర్డర్ జరిగింది .. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బ తినడం అనేది అప్పుడే మొదలైంది .. కాపులే కాకుండా అన్నీ వర్గాల వారు రంగా మర్డర్ తరవాత వెయ్యి కోట్ల ఆస్తుల్ని తగలబెట్టడం జరిగింది. ప్రజాదరణ కలిగిన వ్యక్తులని చంపడమే కాకుండా ఇతరుల వైపు వేలు చూపిస్తూ హత్య రాజకీయాలు , కక్ష సాధింపు రాజకీయాలు అని మాట్లాడడం చంద్రబాబు కే చెల్లింది " అంటూ ఆమంచి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక టీడీపీ ఆరోపిస్తున్నట్టు ఆమంచి & అనుచరులు నాగార్జునరెడ్డి అనే జర్నలిస్టుపై దాడి చేసినట్టు చెపుతున్నారు. వాస్తవంగా నాగార్జున రెడ్డి అసలు జర్నలిస్ట్ కాదు అంటూ చాలా మంది స్థానిక జర్నలిస్టులు సైతం చెపుతున్నారు. ఈ వివాదంలో స్థానిక జర్నలిస్టులు సైతం ఆమంచికే సపోర్ట్ చేస్తున్నారు. వివాదాలకి కేంద్ర బిందువుగా ఉండే నాగార్జున రెడ్డి గతంలో ఎంతోమందిని జర్నలిస్టు పేరు చెప్పి బ్లాక్మెయిలింగ్కు పాల్పడడంతో పాటు చాలా బెదిరింపులకు పాల్పడిన ఉదంతాలను సైతం వారు ప్రస్తావిస్తున్నారు.
ఈ విషయంలో చీరాల బంద్కు టీడీపీ వాళ్లు పిలుపు ఇచ్చినా ప్లాప్ అయ్యింది. ప్రజలు తమ తమ పనుల్లో నిమగ్నం అయ్యారే తప్ప బంద్ గురించి పట్టించుకున్న వాళ్లు లేరు. చీరాల ప్రజల నుంచి సైతం నాగార్జున రెడ్డి ఎన్నో ఏళ్ల నుంచీ రకరకాలు గా వివాదాలు సృస్టిస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక గత ఎన్నికలకు ముందు నుంచి నాగార్జున రెడ్డి కరణం బలరాంకు అనుచరుడిగా ఉండడంతో పాటు టీడీపీకి ఏజెంట్గా పనిచేశాడన్న ఆరోపణలు సైతం అతడిపై ఉన్నాయి. ఇక ఇప్పుడు చీరాలలో ఆమంచిని ఎదుర్కొనే సత్తా లేక కరణం బలరాం చీటికి మాటికి అక్కడ పాలనలో వేలుపెట్టి, అధికారులపై దురుసుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఏదేమైనా కరణం బలరాం చీరాలలో రాజకీయ ఆధిపత్యం కోసం ఆడుతున్న క్రీడలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.