హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సి ఏ ) కార్యవర్గ ఎన్నికల్లో తెర వెనుక రాజకీయం నడిచిందా ? అంటే అవుననే వాదనలు విన్పిస్తున్నాయి . హెచ్ సి ఏ అధ్యక్ష పదవి కోసం, ఇటీవల టీఆరెస్ ను వీడి బీజేపీ లో చేరిన గడ్డం వివేక్ పోటీ చేయాలని తొలుత భావించారు . ఈ మేరకు నామినేషన్ దాఖలు చేశారు . అయితే సాంకేతిక కారణాల వల్ల ఆయన నామినేషన్ ను ఎన్నికల నిర్వహణ అధికారి తిరస్కరించారు . దీనితో హెచ్ సి ఏ లో గట్టి పట్టున్న వివేక్ , ప్రకాష్ చంద్ ప్యానెల్ కు మద్దతు తెలిపారు .
హెచ్ సి ఏ ఎన్నికల్లో ఎలాగైనా వివేక్ ను నిలువరించడం ద్వారా , తమ సత్తా చాటాలని అధికార పార్టీ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది . హెచ్ సి ఏ అధ్యక్ష పదవి కోసం భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ పోటీ చేస్తుండడం తో … వివేక్ మద్దతునిస్తోన్న ప్రకాష్ చంద్ ప్యానెల్ ను ఓడించేందుకు అధికార పార్టీ తెర వెనుక నుంచి ఆయన కు మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది . హెచ్ సి ఏ లోని మెజార్టీ సభ్యులను అజహరుద్దీన్ ప్యానెల్ కు ఓటు వేసే విధంగా మంత్రి కేటీఆర్ మంత్రాంగం నడిపినట్లు ఉహాగానాలు వినిపిస్తున్నాయి . ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్న అజార్ , ఆ పార్టీ సీనియర్ నేత వి . హన్మంతరావు మద్దతు తో ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ , అధికార పార్టీ అండదండలతోనే అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారన్న వాదనలు హెచ్ సి ఏ వర్గాల్లో వినిపిస్తున్నాయి .
హెచ్ సి ఏ అధ్యక్ష పదవి దక్కించుకున్న అజార్ , అప్పుడే టీఆరెస్ లో చేరబోతున్నారన్న పుకార్లు , షికార్లు చేస్తున్నాయి . అధికార పార్టీ చేసిన సహాయానికి కృతజ్ఞత గా అజార్, అధికార పార్టీ లో చేరుతా రో ? లే దో ? చూడాలి మరి.