పసిపిల్లలు దేవుడితో సమానంఅంటారు. వాళ్ళను దేవుడితో సమానంగా చూస్తారు. ఇక వైద్యం చేసే డాక్టర్ ను నడిచే దేవుడు అంటారు. అలాంటి దైవసమానమైన డాక్టర్లు పసిపిల్లల జీవితాలతో ఆదుకోవడం దురదృష్టకరం అని చెప్పాలి. మరీ దారుణంగా డబ్బుల కోసం వారి ప్రాణాలతో చెలగాటం ఆడటం మరీ దురదృష్టకరం అని చెప్పాలి. ఫార్మా కంపెనీలు ఇచ్చే డబ్బులకు కక్కుర్తిపడి.. చదివిన చదువుకు, చేస్తున్న వృత్తికి అన్యాయం చేస్తున్నారు.
జబ్బులతో డబ్బులు లేక ప్రభుత్వ హాస్పిటల్ కు వచ్చే పిల్లలపై ఫార్మా కంపెనీలు తయారు చేస్తున్న మందులను క్లినికల్ ట్రయల్ పేరుతో ఇష్టం వచ్చినట్టుగా ప్రాణాలతో ఆడుకుంటున్నారు. మందులు వికటించి మృత్యువాత పడుతుంటే ఏవో కారణాలు చెప్పి పంపించి వేస్తున్నారు. అసలు విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే, క్లినికల్ ట్రయల్ విషయంలో కొన్ని అజాగ్రతల వలన ఈ విషయం బయటకు పొక్కింది.
దీంతో ఇప్పుడు పెద్ద దుమారం రేగుతున్నది. దీనిపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. విచారణలో అనేక విషయాలు వెల్లడి కాబోతున్నట్టు సమాచారం. గత కొన్నాళ్లుగా ఈ వ్యవహారం నడుస్తున్నా అసలు బయటకు పొక్కకపోవడం విశేషం. ఎవరూ కూడా దీన్ని గుర్తించలేదు. దాదాపు 50 మంది పిల్లలపై ఈ క్లినికల్ ట్రయల్ ను దాదాపు 50 మంది పిల్లలపై ప్రయోగించారని తెలుస్తోంది.
ఇద్దరు పీడియాట్రికల్ డాక్టర్లు గొడవ పడటం వలన ఈ విషయం బయటకు వచ్చింది. నీలోఫర్లోని కొందరు డాక్టర్లు ఇందుకు సహకరిస్తున్నారని, నిషేధిత డ్రగ్స్ కూడా క్లినికల్ ట్రయల్స్లో వాడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నీలోఫర్లో క్లినికల్ ట్రయల్స్ విషయమై తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో.. ఈ ఘటనపై విచారణ జరపాలని వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేశ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అసలే ప్రభుత్వ దవాఖాన అంటే ప్రజలు భయపడుతున్నారు. నీలోఫర్ లో పిల్లలకు రక్షణ లేదని ఇప్పటికే ఆరోపణలు వస్తున్నాయి. ప్రజలు తమ పిల్లలను నీలోఫర్ హాస్పిటల్ కు తీసుకెళ్లాలి అంటే భయపడుతున్నారు. ఈ సమయంలో ఇలాంటి విషయాలు జరిగితే.. ప్రభుత్వ హాస్పిటల్స్ ను నమ్మే స్థితిలో ప్రజలు ఉండరు.