డబ్బు డబ్బు డబ్బు.. ఈ డబ్బు కోసం మనుషులు ప్రజల మానప్రాణాలతో ఆడుకుంటున్నారు. పేదవాళ్ల జీవితాలతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా పేద ప్రజలకు అండగా ఉంటామని చెప్తున్న ప్రభుత్వాలు ఇప్పుడు ఏం చేస్తున్నాయి.. పేద పిల్లల జీవితాలను మధ్యలోనే తుంచేస్తున్న ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యానికి సమాధానం ఏమని చెప్తారు.
జీవితంలో డబ్బు ఉపయోగం ఉండొచ్చు. కానీ, జీవితమే డబ్బు కాకూడదు. అలా డబ్బు సంపాదించాలి అని తపన ఉంటె వైద్యవృత్తిని పక్కన పెట్టి ఏదైనా వ్యాపారం చేసుకోవాలనిగాని, ఇలా పసి పిల్లల జీవితాలపై వ్యాపారం చేయకూడదు. పేదపిల్లలే కదా ఏముందిలే.. ఎవరు పట్టించుకుంటారు అని అనుకుంటే.. ఆ తరువాత జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుంది.
ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా. పేదలుగా పుట్టడం వారి తప్పు కాదు.. వైద్యో నారాయణో హరి అని డాక్టర్లను సంబోధిస్తారు. వైద్యం చేసే అవకాశం ఒక్క డాక్టర్ కు మాత్రమే లభిస్తుంది. ప్రాణాలను నిలబెట్టే వైద్యులు ఆ ప్రాణాలపై ప్రయోగాలు చేస్తూ.. భావి భారత పౌరులుగా ఎదగాల్సిన పిల్లలను పసిమొగ్గలుగా ఉన్న సమయంలోనే తుంచేస్తే ఆ పాపం ఊరికే పోదు. తప్పుడు ఎప్పుడు చేసినా ఎక్కడ చేసినా తప్పే అవుతుంది.
దానికి పర్యవసానం ఏదో ఒక రూపంలో తప్పనిసరిగా వారికీ అంటుకుంటుంది. క్లీనికల్ ట్రయల్ పేరుతో నీలోఫర్ లో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న సమయంలో వీటిపై హాస్పిటల్ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలి. లేదు అన్నింటిని చూసినట్టు దీన్ని కూడా పట్టించుకోకుండా అలా వదిలేస్తాములే అనుకుంటే.. చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ తరువాత ఎవరూ ఏమి చేయలేరు. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవడం మంచిది. లేదంటే ప్రజలే సరైన సమాధానం చెప్తారు.