దసరా వస్తుంది అంటే పిల్లలు పెద్దలు లగేజి సద్దుకొని ఊర్లకు ప్రయాణం అవుతుంటారు. ఉన్న ఊరిని సంవత్సరంలో ఒకసారైనా చూసిరావాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే ఊరు వెళ్లేందుకు దసరా సెలవులను వాడుకుంటారు. పండుగంటే ప్రతి ఒక్కరికి సరదానే.. ఆ సరదాను రైల్, బస్సు సర్వీసులు క్యాష్ చేసుకుంటుంటాయి. రైల్వే చార్జీలు పెంచకపోయినా అదనంగా కొన్ని ట్రైన్స్ వేస్తుంటారు. అది అదనపు ఆదాయమే.
ఇక బస్సుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాములు రోజుల్లో ఐదు వందలు ఉండే టికెట్... పండుగ సీజన్లో డబుల్, త్రిబుల్ ఉంటుంది. ప్రయాణికులు సైతం అంతపెద్దమొత్తంలో డబ్బు పెట్టి ఊరికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే, ప్రతి దసరా, సంక్రాతి సీజన్ సమయంలో రైల్వేలు ఫ్లాట్ ఫామ్ టికెట్ ను పెంచుతుంటారు. మాములుగా ఇప్పుడు ఫ్లాట్ ఫామ్ టికెట్ ధర రూ. 10 ఉన్నది. అయితే, దీన్ని ఎప్పుడు రూ. 20 చేస్తుంటారు. కానీ, ఈసారి దానికి అదనంగా మరో పది యాడ్ చేయడంతో ప్రయాణికులు షాక్ అవుతున్నారు.
పది రూపాయలు ఉన్న ఫ్లాట్ ఫామ్ టికెట్ ముప్పై రూపాయలు చేయడం ఏంటని వాపోతున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని ఫ్లాట్ ఫామ్ లపై రద్దీని తగ్గించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే అధికారులు చెప్తున్నారు. సెండాఫ్ ఇచ్చేందుకు స్టేషన్ వరకు వచ్చి.. స్టేషన్ లోపల ఫ్లాట్ ఫామ్ మీదకు వచ్చి అక్కడే ట్రైన్ కదిలే వరకు ఉండటంతో చాలామంది ప్రయాణికులు మిగతా ఫ్లాట్ ఫామ్ మీదకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతుంటారు. ట్రైన్ మిస్ అవుతుందేమో అనే భయంతో టెన్షన్ పడుతుంటారు.
ఈ టెన్షన్ నుంచి బయటపడేందుకు ఫ్లాట్ ఫామ్ మీద రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారట. రేపటి నుంచి ఈ టికెట్ ధర అమలులోకి వస్తుంది. అక్టోబర్ 10 వ తేదీవరకు ఈ ధర అమలులో ఉంటుంది. దీని వలన రైల్వేకు అదనంగా ఆదాయం వస్తుందని అధికారులు చెప్తున్నారు. విజయవాడ నుంచి వైజాగ్ వరకు ఈ ఫ్లాట్ ఫామ్ టికెట్ ధర అమలులో ఉంటుందని తెలుస్తోంది. ఇక ప్రత్యేక రైళ్లను ఈ మార్గాల్లో ఎక్కువగా నడుపుతున్నారు. విజయవాడ వైజాగ్, విజయవాడ.. హైదరాబాద్ మధ్య రైళ్లను అధికంగా నడుపుతున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. మొత్తానికి దసరా పండుగను అంత్యంగా వైభవంగా జరుపుకోవడానికి జేబులు ఖాళీ చేసుకుంటున్నారన్నమాట.