మరికొన్ని రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆయా పార్టీలు ఇప్పటి నుంచే కృషి చేయడం మొదలుపెట్టాయి. నిరుద్యోగం, ఉపాధి తదితర అంశాలు ఎలా ఉన్నప్పటికీ ఇప్పుడు అందరిని భయపెడుతున్నది మాత్రం ఉల్లి మాత్రమే. ఉల్లిధరలు ఆకాశాన్ని తాకడంతో ఇదే ప్రధానపాత్ర పోషించబోతున్నది. ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దేశరాజధాని ఢిల్లీలో ఉల్లి ధర 70 నుంచి 80 రూపాయలకు చేరుకుంది.
దీంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటు ముంబైలో సైతం ఈ ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఎలాగైనా ధరలను తగ్గించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కేంద్రం గిడ్డంగుల నుంచి విదేశాలకు ఉల్లిపాయలను ఎగుమతి చేస్తున్నది. ముఖ్యంగా పాకిస్తాన్ వంటి దేశాలకు ఎక్కువుగా ఎగుమతి అవుతున్నాయి. అయితే, ఈ ఎగుమతి తాత్కాలికంగా నిలిపివేసింది. అంతేకాదు, గిడ్డంగుల్లో ఉన్న 56వేల టన్నుల ఉల్లిపాయల్లోనుంచి 16వేల టన్నుల ఉల్లిపాయలను మహారాష్ట్ర, ఢిల్లీ, హరియాణా రాష్ట్రాలకు సప్లై చేసింది. అక్కడి మార్కెట్ లో 23 రూపాయలకు అమ్ముతున్నది. దీంతో ధరలు దిగి వచ్చాయి.
కేంద్రం గిడ్డంగుల్లో కావాల్సినంత స్టాక్ ఉందని, అవసరమైన రాష్ట్రాలు తీసుకోవచ్చని, రాష్ట్రాలకు 16 రూపాయల చొప్పున ఇస్తున్నట్టు కేంద్రం పేర్కొన్నది. రాష్ట్రాలు తమ మార్కెట్లో 24 రూపాయల చొప్పున విక్రయించుకునే అవకాశం ఇచ్చింది. తద్వారా దేశంలో ఉల్లి కొరతను నివారించవచ్చని కేంద్రం భావించింది. మాములుగా ఉల్లికి కొరత వచ్చేది కాదు.
నవంబర్ లో కొత్తపంట చేతికి వస్తుంది. అలా ఆ పంట చేతికి వస్తే.. ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ అక్టోబర్ లో ఎన్నికలు ఉండటం... పైగా ఉల్లిపాయలు ఎక్కువగా పండించే కర్ణాటక, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడం వలన పంటకు నష్టం వాటిల్లింది. దీంతో ఉల్లి ధరలు పెరిగాయి. పైగా అక్టోబర్ లో ఎన్నికలతో పాటు పండుగకు కూడా ఉండటంతో ఈ ధరలను దళారులు మరింత పెంచేస్తున్నారు.