గత కొంతకాలంగా ఉత్తరాధిని వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా.. మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం వర్షాలు కురవడం ఇంకా తగ్గలేదు. వర్షం దారుణంగా కురుస్తోంది. కుండపోత వర్షాలకు ఊర్లు చెరువులు ఒక్కటయ్యాయి. ఎప్పుడు బీహార్ లో వర్షాలు తక్కువగా కురుస్తుంటాయి. అలాంటిది ఈసారి అక్కడ కూడా భారీ వర్షపాతం నమోదైంది. ఎప్పుడు లేనంతగా రికార్డుస్థాయిలో వర్షం కురుస్తోంది.
బీహార్లోని 15 జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. 20 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. అవసరమైతే ఆర్మీ సైతం రంగంలోకి దిగేందుకు సిద్ధం అయ్యింది. వర్షానికి సామాన్యులు, మంత్రులు అనే తేడా ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరిని వర్షం భయపెడుతున్నది. ఇప్పటికే బీహార్ ఉపముఖ్యమంత్రి ఇంట్లోకి నీళ్లు వెళ్లాయి. మంత్రుల ఇల్లు నీట మునిగాయి. గత మూడు నెలల్లో బీహార్లో ఈ స్థాయిలో వర్షాలు కురవడం ఇది రెండోసారి. కొన్ని రోజుల క్రితం కూడా ఇలానే వరదలు ఆ రాష్ట్రాన్ని ముంచెత్తాయి.
ప్రజలను ఇప్పటికే చాలా వరకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అంతేకాదు, ప్రజలకు అవసరమైన ఏర్పాట్లను చురుగ్గా చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె, అటు మహారాష్ట్ర, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో కూడా మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో అక్కడి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. అక్కడ లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు.
ఇప్పటికే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ముందు జాగ్రత్తగా ప్రజలను అక్కడి నుంచి తరలిస్తున్నారు. కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వం దగ్గరుండి చూసుకుంటోంది. అయితే, ఇలా భారీగా కురుస్తున్న వర్షపు నీళ్లను వృధాగా సముద్రంలోకి వెళ్లకుండా చూసుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరలా ఎప్పుడు వర్షాలు పడతాయో తెలియదు. పైగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎండాకాలంలో తీవ్రమైన నీటి ఎద్దడి కనిపిస్తుంది. దాని నుంచి బయటపడాలి అంటే ఇప్పుడు ఈ నీళ్లను వృధా పోనివ్వకుండా స్టాక్ చేసుకుంటే మంచిది.