తెలంగాణలో వరంగల్ తర్వాత అంతటి ప్రత్యేకతలు,అభివృద్ధి కలిగి ఉన్న నగరం....వరంగల్. వరంగల్ నగరానికి ఉన్న చారిత్రక విశిష్టత, పర్యావరణ, పురావస్తు అంశాల ప్రాధాన్యం ఎంతో గుర్తింపును సంతరించుకుంది. అయితే, ప్రభుత్వం పరంగా ఇక్కడ జరగాల్సినంత అభివృద్ధి జరగడం లేదనే టాక్ ఉంది. దీనిపై తాజాగా, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు దృష్టిసారించారు. వరంగల్ మాస్టర్ప్లాన్ ముసాయిదాపై కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) పరిధిలోని మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రణాళికాబద్ధంగా వరంగల్ నగరం సమగ్రాభివృద్ధి చెందేలా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కుడా మాస్టర్ప్లాన్ తయారుచేస్తున్నామని ఆయన ప్రకటించారు.
నగరాల అభివృద్ధికి మాస్టర్ప్లాన్ కీలకమైనదని, భవిష్యత్తరాలు మెచ్చుకొనేలా అన్నివర్గాల ప్రతిపాదనలు, సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని మాస్టర్ప్లాన్ను రూపొందించాలని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్వయంగా మాస్టర్ప్లాన్ గురించి వివరించారు. మాస్టర్ప్లాన్ ముసాయిదాలో రేడియల్ రోడ్లను ఔటర్ రింగ్రోడ్డుకు కలుపుతూ అద్భుతమైన రహదారి వ్యవస్థ ఏర్పాటుచేసేందుకు వీలున్నదని చెప్పారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా గ్రోత్ కారిడార్లు, ఇండస్ట్రియల్ జోన్ల ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని వివరించారు. అవసరాలకు అనుగుణంగా కుడా పనివిధానం మారాలని, నిధుల సమీకరణకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. హెచ్ఎండీఏ తరహాలో ల్యాండ్ పూలింగ్, భూ హక్కుల బదిలీ విధానం తరహా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.
వరంగల్ మాస్టర్ప్లాన్ ముసాయిదాపై అన్నివర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. కుడా పరిధిలోకి వచ్చే వివిధవర్గాలు, భాగస్వాములతో విస్తృతంగా చర్చించాక మాస్టర్ప్లాన్ ముసాయిదా తయారుచేశామని వివరించారు. సుమారు నాలుగువేల సూచనలు, సలహాలు, అభ్యంతరాలు వచ్చాయని, వీటిని పరిగణనలోకి తీసుకొని, 2041 వరకు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మాస్టర్ప్లాన్ ముసాయిదాకు రూపకల్పన చేశామని తెలిపారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా పక్కా సమాచారంతో మాస్టర్ప్లాన్ ముసాయిదాలో అంశాలను చేర్చాలని, ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల పరిధిలోని అంశాలపై కుడాకు ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు.