వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఎన్నికలకు ముందు ఎలా ఉన్నారో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నారా? ఆయన పద్ధితిలో ఏమీ మార్పు కనిపించడం లేదా? అటు రాజకీయంగాను, ఇటు పాలన పరంగానూ ఆయన తన వ్యవహార శైలిని మార్చుకోలేదా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు మా నేత ఎలా ఉన్నారో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఆయన ఎవరిమాటా వినిపించుకోవడం లేదు. తాను చేయాలని అనుకున్న పనిని చేస్తున్నారు. వాటి పర్యవసానాలను పట్టించుకోవడంలేదు.
ఇప్పుడు వైసీపీ నాయకులు ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. మరి ఎందుకు ఇలా ఉంది పరిస్థితి? ఇలా ఉంటే ఏం జరుగుతుంది? అనేది విశ్లేషకులు కూడా దృష్టి సారిస్తున్న అంశం. అనేక విషయాల్లో కేంద్రం నుంచి కానీ, ఇటు రాష్ట్రంలోన ప్రధాన ప్రతిపక్షాలు కానీ.. విమర్శలు చేస్తున్నాయి. అయితే, జగన్ వీటిని ఎక్కడా లెక్కలోకి తీసుకోవడం లేదు. తాను చేయాలని అనుకున్న వాటిని చేసుకుపోతున్నారు.
ఈ క్రమంలోనే పోలవరం రివర్స్ టెండర్లు సహా సచివాలయ ఉద్యోగుల నియామకం వంటివాటిని ఆయన చేపడుతున్నారు. ఎన్నికలకు ముందు కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉండి .. అసెంబ్లీకి రావడం లేదని, అలాంటి పార్టీకి ఓట్లెందుకు వేయాలని అధికారంలో ఉన్న టీడీపీ ఆరోపించింది. అదేవిధంగా పవన్.. కూడా వ్యాఖ్యానించా రు., అయితే, ఆ వ్యాఖ్యలను విమర్శలను కూడా జగన్ ఎక్కడా పట్టించుకోలేదు.
ఇప్పుడు కూడా ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను ఆయన పట్టించుకోవడం లేదు. తాను చేయదలుచుకున్నది చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున ఏదైనా తప్పు జరిగితే.. ఆ తప్పును వేరేవారిపై నెట్టేసి చేతులు కూడా దులుపు కోవడం లేదు. తప్పు ప్రభుత్వం చేసిందనే ఒప్పుకొంటున్నారు. అంతిమంగా చూస్తే.. జగన్ అభిప్రాయం ఒకటే కనిపిస్తోంది. తాను ఎవరికైనా సమాధానం చెప్పాల్సి వస్తే.. అది ప్రజలే.
ప్రజలకే తాను జవాబుదారిగా ఉండాలని, వారికే సమాధానం చెప్పాలని, వారికి ఇబ్బంది లేనంత వరకు తాను ఎవరి విమర్శలకు ఇబ్బంది పడాల్సిన, సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని భావిస్తున్నారని సమాచారం. మరి ఈ తరహా వాతావరణం .. మంచిదేగా.. ప్రజలకు మించి ఏ నాయకుడైనా ఎవరికి జవాబు చెప్పాలి. ఈ విషయంలో ప్రతిపక్షాలే ఆలోచించుకోవాలి!!