2018 తెలంగాణ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు బీజేపీతో విభేదించి తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకున్నాడు. అంతకు ముందు పదేపదే ఢిల్లీ వెళ్లి అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలను కలిసి మాట్లాడి వారితో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసి సఫలం అయ్యారు. పొత్తులో భాగంగా తెలంగాణలో కలిసి పోటీ చేశారు. కలిసి ప్రచారం చేశారు. తెలుగుదేశం, కాంగ్రెస్ కలిసి మహాకూటమిగా ఏర్పడటంతో.. అధికారం తమదే అన్నట్టుగా ప్రచారం చేసుకున్నాయి. తీరా ఎన్నికలు పూర్తయ్యి రిజల్ట్ చూస్తే.. రెండు పార్టీలు దారుణంగా దెబ్బతిన్నాయి.
తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వలనే కాంగ్రెస్ పార్టీకి దారుణమైన ఎదురు దెబ్బ తగిలిందని పార్టీ నేతలు బహిరంగంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకోవడంతో ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దీంతో ప్రజలు రెండు పార్టీలను బహిష్కరించారు. గతం గతః. ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో సైతం దారుణంగా ఓడిపోయింది.
పార్టీ ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటోంది. యూపీఏలో కలిసి మహాకూటమిగా ఏర్పడ్డ పార్టీ.. తరువాత ఆ కూటమికి దూరంగా ఉన్నది. ఇలా దూరంగా ఉండటం వెనుక ఆంతర్యం ఏంటి.. అధికారంలోకి వస్తే ఒకలా లేకుంటే మరోలా ప్రవర్తించడం రాజకీయ పార్టీలకు మాములే అనే విషయం అర్ధం అయ్యింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇలా చేస్తుంది అనే విషయం అందరికి తెలిసిందే.
ఇదిలా ఉంటె, ఇపుడు తెలంగాణాలోని హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజక వర్గానికి ఉపఎన్నిక జరుగుతున్నది. ఈ ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా అభ్యర్థిని నిలబెట్టి అందరికి షాక్ ఇచ్చింది. అక్కడ తెలుగుదేశం పార్టీకి పట్టు ఉందొ లేదో తెలియదు. గతంలో తెలంగాణాలో బలంగా ఉన్నది కాబట్టి కొంతమేర ప్రభావం చూపొచ్చు అనే ఉద్దేశ్యంతో టిడిపి అభ్యర్థిని నిలబెట్టింది. ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. రేపు టిడిపి అభ్యర్థి కిరణ్మయి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. మరి ఈ చతుర్ముఖ పోటీలో ఎవరు విజయం సాధిస్తారో తెలియాలంటే అక్టోబర్ 24 వరకు ఆగాల్సిందే.