తెలంగాణలోని హుజూర్ నగర్ నియోజక వర్గంలో ప్రస్తుతం ఎన్నికల వేడి రగులుకుంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు నాలుగు ప్రధాన పార్టీలు అభ్యర్థులను సిద్ధం చేసుకున్నారు. తెరాస, కాంగ్రెస్, టీడీపీలు ప్రధాన అభ్యర్థులుగా ఓసీలను రంగంలోకి దించితే.. బీజేపీ బీసీ అభ్యర్థి డాక్టర్ కాటా ను రంగంలోకి దించింది. కాగా, నామినేషన్ దాఖలు చేయడానికి ఈరోజు ఆఖరు రోజు కావడంతో.. అన్ని పార్టీలు ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. వీరితోపాటుగా సర్పంచ్ ఫోరం సభ్యులు కూడా ఈ ఎన్నికల్లో మూకుమ్మడిగా పోటీ చేస్తున్నారు.
ఇది తెరాస కు ఇబ్బందికరమైన అంశం అని చెప్పాలి. ఎలాగైనా ఈ ఉప ఎన్నికల్లో గెలవాలని, హుజూర్ నగర్ ను చేజిక్కించుకోవాలని కారు భావిస్తోంది. అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకొని పావులు కడుపుతున్నది. ఇప్పటికే అక్కడ పార్టీలోని సీనియర్ నేతలను, ఇతర నేతలను అక్కడ మోహరించింది. దాదాపు 700 మంది వరకు పార్టీ సిబ్బంది ఈ ఎన్నికల ప్రచారంలో రంగంలోకి దిగారు. నియోజక వర్గంలోని ప్రతి ఇంటికి ప్రచారం చేయబోతున్నారు.
ఎలాగైనా పార్టీని గెలిపించి.. తమ పట్టునిలుపుకోవాలని చూస్తున్నది తెరాస. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా తన వ్యూహాలకు పదునుపెడుతున్నది. గతంలో గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి అక్కడ మంచి పలుకుబడి ఉంది. ఇప్పుడు అయన భార్య పోటీ చేస్తున్నది కాబట్టి ఆమెను కూడా గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. అయితే, రేవంత్ నుంచి కొంత ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది. తాను సూచించిన అభ్యర్థిని కాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యకు సీటు ఇవ్వడంతో రేవంత్ కొంత అసంతృప్తితో ఉన్నాడు.
ప్రధానంగా పోటీ ఈ రెండు పార్టీల మధ్యనే ఉంటుంది అని చెప్పొచ్చు. అయితే బీజేపీ, టిడిపిలు కూడా పోటీ చేస్తుండటంతో.. ఏ పార్టీల ఓట్లు చీలుతాయో.. ఏ పార్టీకి మెజారిటీ తగ్గుతుందో తెలియదు. వచ్చే ఎన్నికల వరకు రాష్ట్రంలో బలపడాలి అంటే బీజేపీకి ఇది కీలకం అని చెప్పాలి. తప్పని సరిగా అక్కడ ఓటింగ్ శాతం పెంచుకోవాలి. ఇక మనుగడ కోసం టిడిపి పోరాటం చేస్తుంది కాబట్టి అసలు ఎంతవరకు టిడిపికి బలం ఉన్నది అనే విషయం ఈ ఉపఎన్నికతో తేలిపోతుంది. ఒకవేళ పార్టీకి బలం ఉంది అని తేలితే తప్పకుండా పార్టీ తిరిగి గట్టిగా ప్రయత్నం చేస్తుంది.