కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి కసాయిల మారింది. తన ప్రాణాలను అడ్డు పెట్టి మరి పిల్లల ప్రాణాలు కాపాడాల్సిన తల్లి... తన కూతురి ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడటం లేదు. తన పదేళ్ళ కూతురిని చిత్రహింసలు పెడుతూ నరకం చూపిస్తుంది ఆ తల్లి . రెండు రూపాయలు తీసుకుందన్న కోపంతో కట్టెల పొయ్యిలో కాలుతున్న కర్రుతో తన పదేళ్ళ కూతురు వంటిపై వాతలు పెట్టింది. నొప్పి భరించలేక చిన్నారి అరవటంతో చుట్టుపక్కల వారు పరిగెత్తుకు వచ్చి ఆ కసాయి తల్లి నుంచి ఆ చిన్నారిని కాపాడారు. అక్కడ ఆ కన్నతల్లి చేసిన నిర్వాకం చూసి చుట్టుపక్కల వారందరూ నివ్వెరపోయారు.
వివరాల్లోకి వెళితే... ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పేరుపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి... తన కూతురిని చిత్రహింసలకు గురిచేసింది. రెండు రూపాయలు తీసుకుందన్న కోపంతో కర్రు కాల్చి చేతిపై ఒంటిపై వాతలు పెట్టింది ఆ తల్లి. అయితే చిన్నారి అరుపులకు చుట్టుపక్కలవారు ఇంట్లోకి చేరడంతో... వారిపై కూడా దాడి చేసేందుకు యత్నించింది. అయితే ఎలాగోలా ఆ బాలికను ఆ కసాయి తల్లి నుంచి విడిపించారు చుట్టుపక్కలవారు... ఆ తల్లి రాక్షసత్వాన్ని చూసి నివ్వెరపోయారు.
అయితే తనను చాలా రోజులుగా చిత్రహింసలకు గురి చేస్తుందని ... గత రెండు రోజుల క్రితం కూడా పారతో మూతిపై కొట్టడంతో రెండు పళ్ళు ఊడిపోయాయని బాలిక చెప్పడంతో అక్కడున్న వారందరి మనసు చలించిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఐసిడియస్ సీపిడివో దయామని, అంగన్వాడి సెంటర్ పర్యవేక్షకులు పుష్పవతి లు బాధిత బాలిక ఇంటికి వెళ్లి బాలిక శరీరంపై గాయాలు చూసి చేసే వెంటనే చికిత్స నిమిత్తం ఖమ్మం లోని ఆసుపత్రికి తరలించారు. పుష్పావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.