ఒకే దెబ్బకు రెండు పిట్టలు. అగ్రరాజ్యం స్వీయ ప్రకటన చేసుకొని తనకు నచ్చినట్లే.సర్వం నడవాలనే జులుంతో ఉండే అమెరికాకు....మొండి పట్టుతో మూర్ఖపు ప్రవర్తనతో భారత్ను ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నించే
పాకిస్థాన్ భారతదేశం ఒకే సారి షాక్ ఇచ్చింది. మన ఆయుధ సంపత్తి మన ఇష్టమని స్పష్టం చేసింది. తేడా వస్తే...తేడాగానే తమ వ్యవహారం ఉంటుందని స్పష్టం చేసింది. రష్యా వద్ద నుంచి సుమారు 5.2 బిలియన్ల డాలర్లతో సుమారు అయిదు ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఆయుధాల్ని కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకున్నది. అయితే రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా కొన్ని ఆంక్షలు పెట్టింది.దీనిపై తాజాగా భారత్ ఘాటుగా స్పందించింది.
అమెరికా పర్యటనలో ఉన్న విదేశాంగ శాఖ
మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా విదేశాంగ
మంత్రి మైక్ పొంపియోతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రష్యా నుంచి మిస్సైళ్ల రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఎస్-400ని కొనుగోలు చేసే హక్కు భారత్కు ఉందని స్పష్టం చేశారు. ఎవరి దగ్గర ఎటువంటి మిలిటరీ ఆయుధాలు కొనుగోలు చేస్తున్నామన్న విషయంలో క్లారిటీతో ఉన్నామని, అది మా సార్వభౌమాధికారం అని జైశంకర్ తెలిపారు. మిలిటరీ ఆయుధాలను కొనుగోలు చేసే స్వేచ్ఛ తమకు ఉందని, వాషింగ్టన్ సమావేశంలోనే స్పష్టం చేయడం అమెరికాకు షాక్ ఇచ్చినంత పనయిందని పలువురు చర్చించుకుంటున్నారు.
ఇదిలాఉండగా, గత కొద్దికాలంగా భారత్ దూకుడు నేపథ్యంలో...అమెరికా సంయమనం పాటిస్తున్న సంగతి తెలిసిందే. భారత్,
పాకిస్థాన్ అణ్వాయుధాలు కలిగిన దేశాలు అని, కశ్మీర్ సమస్యను వారే పరిష్కరించుకుంటే మంచిదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. గత వారం న్యూయార్క్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అవసరమైతే తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఎలాంటి అవసరం ఉన్నా.. దానికి ముందు నిలుస్తానన్నారు. భారత ప్రధాని మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్లతో కశ్మీర్ అంశాన్ని చర్చించానన్నారు. రెండు దేశాల మధ్య ప్రస్తుతం పరిస్థితి బాగాలేదని, అందుకే మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇద్దరూ నాకు మంచి స్నేహితులే, కశ్మీర్ సమస్య గురించి ఇద్దరూ చర్చించుకోవాలి, రెండు దేశాలు అణ్వాయుధాలు కలిగిన దేశాలంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. తద్వారా భారత్ శక్తిపై పాక్ గమనిస్తూ ముందుకు సాగుతోందనే విషయం స్పష్టమవుతోంది.