కోట్ల విలువ గల భూములను కేవలం రూపాయికే ఎకరం చొప్పున అమ్మకంపై హై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. చౌకగా అమ్మడానికి గల కారణాలు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు నోటీసు జారీ చేసింది. దీనితో  శారద పీఠానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధారాదత్తం చేసిన భూమి కాస్తా వివాదాస్పదంగా మారింది. హైదరాబాద్​లో అత్యంత చౌక ధరకు భూమిని విశాఖ శారద పీఠానికి కేటాయించడంపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేవలం రూపాయికి ఎకరం చొప్పున కోట్ల విలువైన భూమిని కేటాయించడంపై ప్రభుత్వం వైఖరి ఏంటో తెలపాలని సర్కారుకు నోటీసులు జారీ చేసింది. 




తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్​లోని కోకాపేటలో ఉన్న విలువైన భూములను  విశాఖ శారదపీఠానికి కట్టపెట్టారు. కేవలం రూపాయికే  ఎకరం చొప్పున.. రెండు ఎకరాలను కేటాయించారు. ఈ మేరకు ఏడాది జూన్ 22న ప్రభుత్వం జీవో 71 జారీ చేసింది. జీవోను సవాల్ చేస్తూ సికింద్రాబాద్ లాలాపేట్​కు చెందిన సీహెచ్ వీరాచారి అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.  కోకాపేటలో భూముల మార్కెట్ విలువ కోట్ల రూపాయలు ఉన్నదని... అయితే చట్టవిరుద్ధంగా కేవలం ఒక్క రూపాయికే ఎకరం కేటాయించారని ఆరోపించారు. 



ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టి వేయాలని డిమాండ్ చేశారు. శారద పీఠానికి జరిగిన  భూ కేటాయింపులు రద్దు చేయాలని కోరారు. వీరాచారి దాఖలు చేసిన పిటిషన్ పైన స్పందించిన హై కోర్ట్  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం  ప్రభుత్వాన్ని కోరింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ ఎండీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్​తో పాటు.. శారదపీఠం ధర్మాధికారికి నోటీసులు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: