సూర్య‌పేట జిల్లా హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక విష‌యంలో... ప‌రిణామాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. నామినేషన్ల దాఖలు గడువు సోమవారంతో ముగిసిపోవడంతో మంగళవారం ఉదయం అధికారులు వాటిని పరిశీలించారు. మొత్తం 76 మంది అభ్యర్థులు 119 నామినేషన్లు దాఖలుచేయగా...45 మంది అభ్యర్థుల పత్రాలు సరిగాలేవని రిటర్నింగ్ అధికారి చంద్రయ్య తెలిపారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు సంబంధించి 45 నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. తిరస్కరణ అనంతరం బరిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నలమాద పద్మావతి, బీజేపీ అభ్యర్థి కోట రామారావు, టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయితోపాటు మొత్తం 31 మంది మిగిలారు.


డిపాజిట్ చెల్లించకపోవడం, ఫారం 26 సరిగ్గా నింపకపోవడం, నామినేషన్ ఫారంలో కాకుండా వేరే ఫారంలో దరఖాస్తు చేయడం, సంతకాలు చేయకపోవడం, పది మంది ప్రతిపాదితులు లేకపోవడం వంటి కారణాలతో దరఖాస్తులు తిరస్కరించినట్టు చెప్పారు. నామినేషన్ తిరస్కరణకు గురైన వారిలో సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్‌రావు కూడా ఉన్నారు. ధ్రువీకరణ పత్రాలు సరిగా లేనందున శేఖర్‌రావు నామినేషన్‌ను తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి తెలిపారు. దీంతో సీపీఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ నెల 3 వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉండటంతో మరికొన్ని నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉన్నట్టు స‌మాచారం. 


మ‌రోవైపు, హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతున్నట్లు సీపీఐ ప్రకటించింది. మఖ్దూం భవన్‌లో జరిగిన ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో సీపీఐ పోటీ చేయకూడదని నిశ్చయించుకొన్న క్రమంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్.. ఆ పార్టీ మద్దతు కోరిన విషయం తెలిసిందే. ఇరుపార్టీల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై కార్యవర్గ సమావేశంలో సీపీఐ నేతలు చర్చించారు. అనంతరం టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విలేకరులకు వెల్లడించారు. సమావేశంలోని వివరాలను మీడియాకు వివరిస్త్తూ.. అసెంబ్లీ ఎన్నికల వరకే కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు కొనసాగిందని, పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేశామని గుర్తుచేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: