ఎన్.ఆర్.సి తీసుకొస్తామని.. అదే సమయంలో ఒక్క చొరబాటు దారుడినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా. కోల్‌కతా వేదికగా ఈ అంశంపై ఆయన కుండబద్దలుకొట్టారు. ఈ రెండు విషయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి సవాళ్లు కూడా విసిరారు అమిత్‌ షా. 


ఎన్నికల సమయంలో బీజేపీ తరఫున బెంగాల్‌లో ప్రచారానికి ఇబ్బంది పడ్డ అమిత్‌ షా.. కేంద్ర హోంమంత్రి హోదాలో కోల్‌కతాలో పర్యటించి రాజకీయ కాకరేపారు. దసరా సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన దుర్గా పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోల్‌కతాలో ఏర్పాటు చేసిన భారీ సభలో... చాలా ఆవేశపూరిత ప్రసంగం చేశారు. ముఖ్యంగా బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్న ఎన్‌.ఆర్.సి, చొరబాటుదారుల అడ్డగింత విషయంలో చాలా స్పష్ట మైన ప్రకటన చేశారు అమిత్ షా. ఒకనాడు చొరబాటుదారులకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ తీవ్రమైన పోరాటం చేశారని, లోక్‌సభలో సైతం శాలువాను స్పీకర్‌పైకి విసిరికొట్టారని ఆయన గుర్తు చేశారు. సీఎం కాగానే చొరబాటుదారులు ఓటు బ్యాంకుగా మారడంతో స్వరం మార్చేశారని ఆయన విమర్శించారు. ఎవరెన్ని విమర్శలు చేసినా.. అడ్డంకులు సృష్టించినా జాతీయ పౌరసత్వ చట్టం విషయంలో రాజీపడబోమని, ఒక్క చొరబాటుదారుడిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు కేంద్ర హోంమంత్రి. 


మూడు వందలకుపైగా ఎంపీ సీట్లతో మోడీ రెండోసారి అధికారం చేపట్టడంలో పశ్చిమ బెంగాల్‌ కీలక పాత్ర పోషించందన్నారు బీజేపీ అధ్యక్షుడు. 18 ఎంపీ సీట్లు గెలిపించి మార్పు కోరుకుంటున్నామన్న విషయాన్ని ప్రజలు కుండబద్దలు కొట్టారన్నారు. 
బెంగాల్‌కు బీజేపీ  బయటపార్టీ కాదన్న అమిత్‌ షా.. జనసంఘ్‌ వ్యవస్థాపకులు శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ ఈ ప్రాంతానికి చెందినవారేనని గుర్తుచేశారు. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 ఎత్తేయడం కోసం బలిదానం చేశారని పేర్కొన్నారు. శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ ఆశించిన దానిని ప్రధాని మోడీ పూర్తి చేశారన్నారు అమిత్ షా.


మరింత సమాచారం తెలుసుకోండి: