హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ) అధికార టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించడం సామాన్యులకు ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ, రాజకీయ పరిశీలకులు మాత్రం పెద్దగా విస్మయం చెందినట్లు కనిపించడం లేదు . సిపిఐ తరచూ తన వైఖరిని మార్చుకుంటూ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందేనని రాజకీయ పరిశీలకులు ఎద్దేవా చేస్తున్నారు . అధికార పార్టీలకు సన్నిహితంగా మెలగడం సిపిఐ నేతలకు అలవాటుగా మారిందని అపహాస్యం చేస్తున్నారు .
గతంలో తమకు బద్ద విరోధి అయిన కాంగ్రెస్ పార్టీతో జత కట్టిన సిపిఐ ... ఇప్పుడు ఎనిమిది నెలలు తిరిగేసరికి అధికార టీఆర్ఎస్ కు దన్ను గా నిలవాలని నిర్ణయించుకోవడం ద్వారా రాజకీయంగా తీవ్ర విమర్శలనే ఎదుర్కొంటోంది . ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో జతకట్టిన సిపిఐ , ఎనిమిది నెలల వ్యవధిలోనే తన వైఖరిని మార్చుకుని అధికార టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది . ఇంతవరకు అంతాబాగానే ఉన్నప్పటికీ టీఆరెస్ వైఖరి లో వచ్చిన మార్పు ఏమిటన్నది చెప్పకుండానే , ఆ పార్టీ తో సిపిఐ జతకట్టడం సామాన్యులను విస్మయానికి గురి చేస్తోంది . హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆరెస్ కు మద్దతు ఇవ్వాలని, తాజాగా సిపిఐ నేతలు తీసుకున్న నిర్ణయం పట్ల సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
ఏడాది లోపే సిపిఐ తన వైఖరి ఎందుకుమార్చుకున్నదన్నది సామాన్యులకైతే అంతు చిక్కడం లేదు. ప్రజా పోరాటాలే తమ లక్ష్యమని చెప్పుకునే సిపిఐ , ఇప్పుడు అధికార పార్టీ కి మద్దతునిచ్చి , రేపు ఎలా పోరాటాలు చేస్తుందన్న ప్రశ్న తలెత్తుత్తోంది . అధికార పార్టీకి అండగా నిలుస్తోన్న సిపిఐ నేతలు ఇక , రేపు ఎవరిపై పోరాటం చేస్తారంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు . మరి ప్రజల ప్రశ్నలకు సిపిఐ నేతలు ఏమి సమాధానం చెబుతారో చూడాలి మరి .