అక్టోబర్ 21 న మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు భావిస్తున్నాయి. రెండు పార్టీలు అక్కడ తిరిగి పట్టుసాధించేందుకు ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అది అంత ఈజీ కాదు అని అర్ధం అవుతున్నది. కాంగ్రెస్ ఎన్సీపీ పార్టీలు కలిసి పోటీ చేస్తుంటే.. అటు బీజేపీ.. శివసేన పార్టీలు కలిపి పోటీ చేస్తున్నాయి. మొదట రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తారని అనుకున్నారు.
కానీ, బీజేపీ ముఖ్యమంత్రి ఫడ్నవిస్ మాత్రం భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని శివసేనతో పొత్తును వదులుకోలేదు. కలిసి పోటీ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కారణం లేకపోలేదు. విడివిడిగా పోటీ చేసి తరువాత తిరిగి అధికారంలోకి రావడానికి మరలా ఇద్దరు పొత్తుపెట్టుకోవడం కంటే.. ఇద్దరు కలిసే పోటీ చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే సీట్ల సర్దుబాటు కూడా జారిపోయింది. ఇక మిగిలింది ప్రచారం, ఎన్నికలు. ప్రచారం చేసేందుకు రెండు పార్టీలు సిద్ధం అయ్యాయి. ప్రచారానికి సంబంధించిన రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే, శివసేన, బీజేపీ పొత్తు ఇప్పటిది కాదు.. ఎప్పటి నుంచో వస్తున్నది. మొదట్లో శివసేనతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ పెద్దగా ఇష్టపడలేదు. 1985 ముందు వరకు పార్టీకి పెద్దగా పట్టు కూడా లేదు. కొన్ని చోట్ల మాత్రమే నామమాత్రంగా ఉండేది.
1985 తరువాత పరిస్థితి మారింది. బీజేపీ హిందుత్వ అజెండాతో ముందుకు రావడంతో పార్టీకి కలిసి వచ్చింది. అప్పటి నుంచే శివసేన బీజేపీకి దగ్గరైంది. మహారాష్ట్రలో శివసేన బీజేపీకి పెద్దన్నగా ఉన్నది. కాగా, దేశంలో బీజేపీ శివసేనకు మార్గదర్శకంగా నిలిచింది. కానీ, ఇప్పుడు బీజేపీ పరిస్థితి వేరు. దేశంలో భారీ మెజారిటీ సాధిస్తోంది. మహారాష్ట్రలోను మంచి పట్టు సాధించింది. ముంబై మున్సిపాల్టీ ఎన్నికల్లో సైతం ఏకంగా 82 స్థానాలు గెలుచుకొని పట్టు సాధించింది. ఒక్క థానే మిన్నగా మిగతా చోట్ల బీజేపీకి మంచి పట్టు ఉన్నది. అయినప్పటికీ శివసేన తోనే కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది బీజేపీ.