ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు. ఉల్లిని రోజు ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ విషయం అందరికి తెలుసు. అందుకే ఉల్లి లేకుండా ఇంట్లో వంట చేసేందుకు పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించరు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఉల్లిపాయలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. కోయకుండానే ఏడుపు తెప్పిస్తున్నాయి. ఉల్లిపాయలు ధరలు నానాటికి కొండెక్కుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోవడానికి కారణాలు ఉన్నాయి.
అందులో ప్రధాన కారణం, వర్షాలు. ఈఏడాది ఎక్కడ చూసినా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశంలోని ప్రతి రాష్ట్రంలో వర్షం కురిసింది. బీహార్ రాష్ట్రాన్ని సైతం వర్షాలు భయపెడుతున్నాయి అంటే అర్ధం చేసుకోవచ్చు వర్షాలు ఎంతగా దేశాన్ని అల్లడిస్తున్నాయో. ఈ కారణంగానే దేశంలో ఉల్లిపాయ ధరలు కొండెక్కాయి. ఉల్లిని కొనాలి అంటే భయపడుతున్నారు. నవంబర్ లో మాములుగా పంట చేతికి వస్తుంది.
అయితే, ఈ వర్షాల కారణంగా ఆ పంట చేతికి వచ్చే సూచనలు తగ్గిపోయాయి. ఫలితంగా దేశంలో ధరలు పెరిగాయి. దీనిని నివారించేందుకు కేంద్రం ఇప్పటికే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ధరలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఎగుమతులను నిలిపేసింది. మార్కెట్లో 24 రూపాయలకే ఉల్లిపాయలు అందుబాటులో ఉండే విధంగా చూస్తున్నది. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఇంకా ధరలను తగ్గించకుండా రూ. 50 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఇది దారుణమైన విషయంగా చెప్పాలి.
ఈ ఉల్లిపాయలతో పాటు టమోటాలు ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. టమోటా ఎక్కువుగా మదనపల్లి ఏరియా నుంచి వస్తుంది. విచిత్రం ఏమిటంటే టమోటా పంటలు పండే మదనపల్లి ఏరియాలో కూడా ఈ ఏడాది వర్షం విపరీతంగా కురిసింది. ఈ వర్షం దాటికి అక్కడ పంట చాలా వరకు నీట మునిగింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. టమోటా ధరలు కూడా మోత మోగిస్తున్నాయి. ఈ ధరల పెరుగుదల తాత్కాలికమే అని ప్రభుత్వం చెప్తున్నది.