కొరటాల శివ - మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా స్క్రిప్టు ఫైనల్ వెర్షన్ జరుగుతోంది. ఇక ఈ సినిమాకి టెక్నీషియన్లు దాదాపుగా ఖరారయ్యారు. ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేస్తోన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి కొరటాల తన సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తున్నాడని.. కొరటాల మొదటి సినిమా 'మిర్చి' నుండి.. ఆ తరువాత కొరటాల తీసిన శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, మహర్షి చిత్రాలకు మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ ను కాదని, సైరాకి సంగీతం అందించిన అమిత్ త్రివేదిని మెగాస్టార్ తో చేయబోయే సినిమాకి సంగీత దర్శకుడిగా పెట్టుకున్నాడని ఇటీవలే మీడియాలో బాగా వార్తలు వచ్చాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాదే సంగీత దర్శకుడిగా పని చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ చిత్రంలో చిరు ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకోనున్నారని సమాచారం. కొరటాల శివ, మెగాస్టార్ కోసం ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను తయారు చేసారట. ఇక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘సైరా నరసింహా రెడ్డి’ చిత్రం అద్భుతమైన పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబడుతొంది. దాంతో మెగా అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. కాగా ఈ రోజు సినీ ప్రముఖుల కోసం సైరా ప్రత్యేక షోను వేశారు. నాగార్జున, అల్లు అర్జున్, అఖిల్ మరియు కొంతమంది సినీ ప్రముఖులు ఈ ప్రత్యేక షోకి వచ్చారు. సినిమా చూసిన వాళ్ళంతా సినిమా చాల బాగుందని మెగాస్టార్ కి అభినందనలు తెలిపారు.