అమెరికాలో వలసలను అరికట్టేందుకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదంతా చూసి యావత్ ప్రపంచమే నివ్వెరపోతోంది. నిజానికి...వలసదారులు లేకుండా అమెరికా అగ్రరాజ్యంగా ఎదగటానికి అవకాశమే లేకుండాపోయేది. అదంతా మరిచిపోయిన ట్రంప్ ఏకంగా వలసదారులనే లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేయటంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయ్.
సమయం వచ్చినప్పుడల్లా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉంటారు. వలసదారులపై మరోసారి విరుచుకుపడ్డారు ట్రంప్. వలసదారులను అడ్డుకోవడానికి కరెంటు తీగలతో కూడిన గోడను నిర్మించాలంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా దాని పొడవునా పాములు, మొసళ్లు ఉండేలా చూడాలని ఏకంగా వైట్హౌజ్ సలహాదారులకే సూచించారు. తద్వారా వలసదారులను అడ్డఉకోవచ్చని వివరించారు యూఎస్ ప్రెసిడెంట్.
నిజానికి...అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ట్రంప్ వలసదారులపై తనదైన శైలిలో విరుచుకుపడుతూనే ఉన్నారు. ట్రంప్ ప్రవేశపెట్టిన జీరో టాలరెన్స్ విధానం కారణంగా అమెరికాపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విధానం వల్ల ఎంతో మంది వలస చిన్నారులు తమ తల్లిదండ్రులకు దూరం అయ్యారు. మరికొంత మంది అమెరికాలో ప్రవేశించే క్రమంలో ప్రాణాలు సైతం కోల్పోయారు. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాతనైనా ట్రంప్ లాంటి వ్యక్తుల మనసు కరగకపోవటమే ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో వలసదారుల పట్ల కాస్త మెతక వైఖరి ప్రదర్శిస్తామన్నట్లు సంకేతాలు ఇచ్చిన ట్రంప్ మరోసారి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. నేటికీ వలసదారులు అక్రమంగా అమెరికాలో ప్రవేశిస్తున్నారంటూ ఉన్నతాధికారులపై ట్రంప్ విరుచుకుపడినట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. సరిహద్దు గోడ విషయంలో అలసట వహిస్తూ తనను ఇడియట్లా మార్చడానికి ప్రయత్నిస్తున్నారంటూ వారిపై చిందులు తొక్కినట్లు తెలిపింది. ఐతే...సరిహద్దు సమస్యల నేపథ్యంలో.. మైకెల్ షియర్, జూలీ డెవిస్ అనే ఇద్దరు వ్యక్తులు సంయుక్తంగా రచించిన బార్డర్ వార్స్: వలసదారులపై ట్రంప్ అంతరంగం అనే పుస్తకం ఆధారంగా ఈ కథనాన్ని ప్రచురించినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఈ పుస్తకాన్ని అక్టోబర్ 8న ఆవిష్కరించనున్నారు.