నామినేషన్ ల ప్రక్రియలో భాగంగా ఉపసంహరణ తర్వాత హుజూర్నగర్ బరిలో 28 మంది అభ్యర్థులు నిలిచారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. బరిలో నిలిచినా మొత్తం 28 మంది అభ్యర్థులు తమ బలవబలను నిరూపించుకునేందుకు సర్వ సంనర్ధమవుతున్నారు. తొలుత 31 మంది అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేశారు. అయితే వారిలో ముగ్గురు అభ్యర్థులు తమ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థులు ప్రతాప్రెడ్డి, సైదులు, శంకర్ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
ప్రధాన పార్టీల నుంచి తెరాస అభ్యర్థిగా సైదిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మావతి పోటీలో ఉన్నారు. సీపీఎం అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసేందుకు మొత్తం 76 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో 45 నామినేషన్స్ తిరస్కరణకు గురయ్యాయి. ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత స్వతంత్ర అభ్యర్థులతో పాటుగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారితో కలిపి 28 మంది ఉప ఎన్నికల గోదాములో నిలిచారు.
వామపక్ష పార్టీలకు చెందిన సీపీఐ అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు తెలిపింది. కాగా తెలంగాణ జన సమితి(తెజస) జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఒంటరిగానే ఎన్నికల రంగంలోకి దిగడం గమనార్హం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలతో ఎన్నికల పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సారి తెదేపా అభ్యర్థిగా కిరణ్మయి బరిలో నిలిచారు. సీపీఎం అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురవ్వడంతో ఆ పార్టీ మద్దతును తెదేపా కోరుతోంది. ఈ నెల 21న హుజూర్నగర్లో ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.