తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల ఐదవ తేదీ నుంచి సమ్మె కు వెళ్లడం దాదాపు ఖాయమేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి . దీనితో విజయదశమి పండుగకు సొంతూళ్ల కు వెళ్లాలనుకునే వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు . అయితే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ ప్లాన్ బి రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది . ఆర్టీసీ కార్మిక సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు నిలిచిపోయాయి.
గురువారం ఆర్టీసీ జేఏసీ నేతల తో , త్రి సభ్య కమిటీ సభ్యులు జరిపిన చర్చలు విఫలం కావడంతో ఇక ఆర్టీసీలో సమ్మె మోగడమే తరువాయి అన్నట్లుగా పరిస్థితి తయారయింది . ఈ నెల 4వ తేదీ అర్ధరాత్రి వరకు వేచి చూసి ఆ తర్వాత సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ జేఏసీ నేతల తెలిపారు . ఒక్కసారి సమ్మెకు వెళ్లిన తరువాత , ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేస్తున్నారు . ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లాలని నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తమ వద్దనున్న ప్లాన్ -బి రెడీ చేస్తున్నట్లుగా సంకేతాలను ఇస్తోంది.
సమ్మె సమయంలో ప్రైవేటు డ్రైవర్లు, తాత్కాలిక కండక్టర్లను విధుల్లోకి తీసుకుని బస్సులను యధావిధిగా నడపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. డ్రైవర్లకు రోజు 1500, కండక్టర్లకు వెయ్యి రూపాయల చొప్పున చెల్లిస్తామని ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యం అన్ని డిపో లలో సర్క్యులర్లు జారీ చేసింది . ప్రైవేటు డ్రైవర్ గా పని చేయాలనుకునేవారు కనీసం 18 నెలల అనుభవం కలిగి ఉండి, భారీవాహన లైసెన్స్ ఉండాలని సూచించింది . ఇక 10వ తరగతి పాసైన వారు కండక్టర్ గా విధులు నిర్వహించవచ్చునని సదర్ సర్క్యులర్ లో పేర్కొనడం తో , ప్లాన్ బి కి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతున్నట్లు స్పష్టం అవుతోంది .