తెలుగుదేశం పార్టీకి కాపు నేతలను ఒక్కొక్కరుగా దూరమవుతున్నారా ? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానం విన్పిస్తోంది . ఎన్నికల ముందు కొంతమంది కాపు నాయకులు టీడీపీ కి దూరమైతే... ఎన్నికల అనంతరం మరికొంత మంది పార్టీని వీడుతుండడం తెలుగు తమ్ముళ్లకు ఏమిపాలుపోవడం లేదు . కాపు నేతలు ఒకొక్కరుగా పార్టీ వీడుతున్న నేపధ్యం లో, తాజాగా మాజీ మంత్రి శనక్కాయల అరుణ కూడా టీడీపీ కి గుడ్ బై చెప్పి , బీజేపీలో చేరారు . ఎన్నికలకు ముందే అవంతి శ్రీనివాస్, ఆమంచి కృష్ణమోహన్, మాజీ ఎంపీ తోట నరసింహం వంటి వారు టీడీపీ ని వీడి వైకాపాలో చేరిన విషయం తెలిసిందే.
వీరిలో అవంతి శ్రీనివాస్ , జగన్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకోగా , ఆమంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు . తోట నర్సింహం సతీమణి వాణి మాత్రం అతిస్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు . ఎన్నికల అనంతరం కాపు నేతలైన తోట త్రిమూర్తులు, వరుపుల రాజా లు కూడా టిడిపిని వీడారు. తోట త్రిమూర్తులు , ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైకాపా చేరిన విషయం తెల్సిందే . అయితే కొంత మంది టీడీపీ కి చెందిన కాపు నేతలు వైకాపా వైపు చూస్తుండగా... మరికొంత మంది బీజేపీలో చేరేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది .
టీడీపీ కి చెందిన కాపు నేతలపై ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రత్యక దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి . కేంద్రం లో బీజేపీ అధికారం లో ఉండడం , రాష్ట్రం లో టీడీపీ రోజుకింత బలహీనపడుతుండడం తో కాపు సామాజికవర్గ నేతలను క్రమేపీ ఆ పార్టీకి దూరమవుతున్నారని వాదనలు విన్పిస్తున్నాయి . కాపు నేతలు ఒకొక్కరుగా టీడీపీ ని వీడడం చూస్తుంటే , భవిష్యత్తు లో మరికొంతమంది వీడే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు .