తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల నిన్న అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. దింతో దసరా సమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అయితే ఆర్టీసీ పరిస్థితి అధ్వానంగా తయారైందని... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు తమ వేతన సవరణ చేసి తమకు ఉద్యోగ భద్రత కల్పించడం సహా మరికొన్ని డిమాండ్లను ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం ముందుంచారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపిన త్రిసభ్య కమిటీ కార్మికుల డిమాండ్ లను అంగీకరించలేదు.దీంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు .
అయితే ఆర్టీసీ సమ్మె పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆర్టీసీ కార్మికులతో ఇక చర్చలు జరగడానికి వీలు లేదని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. ఆర్టీసీ కార్మికులతో చర్చలు కోసం నియమించిన త్రిసభ్య కమిటీని కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఓ కఠిన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె పై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ప్రభుత్వం... ఈ రోజు సాయంత్రం ఆరు గంటల లోపు ఆర్టీసీ కార్మికులు అందరూ విధుల్లో హాజరవ్వాలని అల్టిమేటం కూడా జారీ చేసింది ప్రభుత్వం.
అయితే ఈ రోజు సాయంత్రం ఆరు గంటల లోపు సమ్మె విరమించి విధుల్లో చేరిన వారిని మాత్రమే ఆర్టీసీ ఉద్యోగుల పరిగణిస్తామని...విధులకు హాజరవ్వని ఆర్టీసీ కార్మికులను ఉద్యోగం నుండి తొలగిస్తామని ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను హెచ్చరించింది.ఈ మేరకు అల్టిమేట్టం కూడా జారీ చేసింది. కాగా విధుల్లో చేరిన వారికి ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తుందని స్పష్టం చేసింది . కాగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నగరవాసులు అందరి చూపు మెట్రో పై పడింది. ఆర్టీసీ బస్సులో లాగానే మెట్రో స్టేషన్లలలో కూడా ప్రయాణికుల రద్దీ పెరిగింది. అయితే ఒకవేళ ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించకపోతే అదే ప్రైవేటు వాహనాలను ప్రభుత్వం ప్రయాణికుల సౌకర్యార్థం నడిపిస్తామని తెలిపిన విషయం తెలిసిందే.