టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఎపిసోడ్ మలుపులు తిరుగుతోంది. నిధుల దుర్వినియోగంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రవిప్రకాశ్పై కేసు నమోదయిన విషయం తెలిసిందే. డైరెక్టర్ల అనుమతి లేకుండా కోట్ల రూపాయలు దారి మళ్లించారని టీవీ 9 సీఈవో సింగారావు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు అయింది. దీంతో తాజాగా, రవిప్రకాశ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, రవిప్రకాశ్ను న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు.
రవి ప్రకాశ్పై సింగారావు చేసిన ఫిర్యాదులో.. రెండేళ్ల కంపెనీ లాభాలను పక్కదారి పట్టించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విత్ డ్రా చేసిన డబ్బులను రవిప్రకాశ్ బోనస్గా చూపించారని పేర్కొన్నారు.బోనస్, ఎక్స్గ్రేషియా పేరుతో ముగ్గురి పేర రూ. 18,31,75,000 విత్ డ్రా చేసినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
రవి ప్రకాశ్ పేరుతో 6 కోట్ల 36 లక్షలు, ఎంకేవీఎస్ మూర్తి పేరుతో రూ. 5,97,87,500, క్లిఫర్డ్ పేరుపై రూ.5,97,87,500 విత్ డ్రా చేసినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సెప్టెంబర్ 18, 2018 నుంచి మే 8, 2019 మధ్య వరకు ముగ్గురి పేరిట లావాదేవీలు జరిగాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
రవి ప్రకాశ్, మూర్తిపై 409, 418, 420 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, గతంలో మరో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. తప్పుడు పత్రాలు సృష్టించి టీవీ9 చానల్ కాపీరైట్స్, టీవీ 9 కంపెనీ రిజిస్టర్ ట్రేడ్మార్క్ను టీవీ9 మాజీ డైరెక్టర్లు రవిప్రకాశ్, ఎంవీకేఎన్ మూర్తి.. మీడియా ఎన్ఎక్స్టీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు రూ.99 వేలకు విక్రయించినట్టు ఏబీసీఎల్ మీడియా డైరెక్టర్ కౌశిక్రావు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ ఫిర్యాదు విషయంలోనూ ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి.
తాజా విచారణలో భాగంగా,
రవి ప్రకాశ్ను మరికాసేపట్లో బంజారాహిల్స్ పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించనున్నారు. నిబంధనల ప్రకారం ఆయన ఆరోగ్యం గురించి చేయవలసిన వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం సికింద్రాబాద్ మారేడ్పల్లిలోని జడ్జీ నివాసంలో పోలీసులు హాజరుపర్చనున్నారు. అనంతరం, న్యాయమూర్తి తీర్పును అనుసరించి ఆయన్ను జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోనున్నారు.