ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు మధ్య ఉన్న తేడా ఏమిటో మరోసారి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాటల్లో కాదు ... చేతల్లో చేసి చూపించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాం తహసీల్దార్ వనజాక్షి పై, అప్పటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేయగా , ఆయన్ని చంద్రబాబు నాయుడు వెనకేసుకుని వచ్చిన విషయం తెల్సిందే . తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదయినప్పటికీ చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు కనీసం టచ్ కూడా చేయలేకపోయారు . తమ పార్టీ ఎమ్మెల్యే తప్పు చేసినా, పోలీసులు అరెస్టు చేయకుండా చంద్రబాబు అడ్డుకున్నారు .
ప్రస్తుతం వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటి పైకి వెళ్లి నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన అనుచరులు రభస సృష్టించిన ఘటన లో ... సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే అని కూడా చూడకుండా చట్టం ముందు అందరూ సమానమేనని భావించి జగన్ మోహన్ రెడ్డి , అధికారులపై అనుచితంగా ప్రవర్తించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఆదేశాలు జారీ చేశారు . టీడీపీ ప్రభుత్వ హయాం లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎన్నో అక్రమాలను చేశారని కానీ తమ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం సొంత పార్టీ ఎమ్మెల్యేను అరెస్టు చేయించారని వైకాపా నేతలు అంటున్నారు . వెంకటాచలం ఎంపీడీవో సరళ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని పోలీసులు అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. ఆయనకు బెయిల్ కూడా మంజూరు అయింది .
అయితే శ్రీధర్ రెడ్డి అరెస్టు ద్వారా చట్టం వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తనకు తన , పర బేధం లేదన్న విషయాన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పకనే చెప్పినట్లయింది . తమ ప్రభుత్వ హయాంలో చట్టం తన పని తాను చేసుకుపోయే వెసులుబాటు కల్పించనున్నట్లు సొంత పార్టీ ఎమ్మెల్యేలను అరెస్టు చేయించడం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విస్పష్టమైన సంకేతాలను ఇచ్చారు .