సైబర్‌ నేరాలు రోజుకో కొత్తపద్దతిలో వెలుగులోకి వస్తున్నాయి.ఇప్పుడు ఈ పేరు వింటేనే భయపడవలసిన పరిస్దితి వస్తుంది.ఎందుకంటే సైబర్ ప్రపంచం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. సైబర్ నేరగాళ్లు ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉండి మన నెట్టింట్లో ప్రవేశించి మన బ్యాంకు ఖాతాను ఖాళీ చేసేస్తున్నారు.మన ప్రైవసీని దెబ్బ తీస్తున్నారు.కంప్యూటర్ ముందు మీటలు నొక్కుతూ అంతరిక్షంలోని కృత్రిమ ఉపగ్రహాల వ్యవస్థను ఛిద్రం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.కంప్యూటర్ వ్యవస్థలను విధ్వంసం చేసి అత్యంత సున్నితమైన సమాచారాన్ని తస్కరిస్తున్నారు.


అంతే కాకుండా భవిష్యత్ లో దేశాల మధ్య యుద్ధాలకు సైబర్ క్షేత్రాలే వేదికలవుతాయనడానికి సందేహం లేదు.ఇక ఇప్పుడు మరో కొత్త తరహ మోసంతో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు.ఇలా జరిగిన మోసంతో ఓ వ్యక్తి నిమిషాల వ్యవధిలో డబ్బులు వదిలించుకున్నాడు.పలమనేరులోని స్థానిక గుడియాత్తం రోడ్డులో ఆదెప్ప అనే వ్యక్తి మీ–సేవ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు.బ్యాంకులో మీకు ఏదైనా సమస్యలుంటే తెలుసుకోవచ్చునని అతని మొబైల్‌కు శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు  గుర్తు తెలియని ఈ నంబర్ నుండి 02264427800 అనే నంబరు నుంచి  వాయిస్‌ రికార్డింగ్‌ వచ్చింది.


తెలుగులో సమాచారం వినేందుకు 4 నొక్కాలని చెప్పడంతో అతను అలాగే చేశాడు. ఇంతలో కాల్‌ కట్‌ అయి నిమిషాల వ్యవధిలో అతని ఖాతా నుంచి రూ.1000, రూ.200, రూ.6000, రూ. 150 ఇలా డబ్బులు డ్రా అవుతున్నట్టు ఎస్‌ఎంఎస్‌లు వచ్చాయి. దీంతో బాధితుడు బ్యాంకుకు పరుగులు తీసి తన ఖాతాను బ్లాక్‌ చేయించాడు. ఆలోపే 40 లావాదేవీలు జరిగి అతని ఖాతాలోని 15వేలు డ్రా అయ్యాయి. ఇదంతా సైబర్‌ నేరగాళ్ల పనంటూ బ్యాంకు అధికారులు తేల్చిచెప్పడంతో బాధితుడు గొల్లుమన్నాడు. స్థానిక పోలీసులకు శనివారం రాత్రి ఫిర్యాదు చేశాడు.ఇక ఇలా పోయిన డబ్బు ఎలాగో తిరిగి రాదు.అందుకే కొత్త నెంబర్ నుండి వచ్చే కాల్స్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్నారు పోలీసులు,బ్యాంక్ అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: