తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని పట్టుబడుతూ సమ్మెకు దిగారు. ప్రభుత్వం బెదిరించినా బెదిరేది లేదని, తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె విరమించేది లేదని ఇప్పటికే స్పష్టం చేశారు. అంతేకాదు, ఆర్టీసీ నష్టాల్లో ఉందని ప్రభుత్వం చెప్తున్నది. కేంద్ర రవాణ శాఖ నుంచి ఎన్నో రకాల నిధులు ఆర్టీసీకి వస్తుంటే ఆర్టీసీ నష్టాల్లో ఎలా ఉంటుందో చెప్పాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
పైగా అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిందని, అక్కడి కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారని, కానీ, ఇక్కడ మాత్రం ప్రభుత్వం హామీలు ఇవ్వడమే కానీ అమలు చేయడంలో వెనుకబడిపోయిందని కార్మికులు వాపోయారు. రెండో రోజుకు సమ్మె కొనసాగింది. అయితే, ప్రభుత్వం ప్రైవేట్ బస్సులను తీసుకొచ్చి నడుపుతున్నది. కొన్ని చోట్ల ప్రవేట్ వ్యక్తులను రిక్రూట్ చేసుకొని బస్సులను నడిపిస్తోంది.
అయితే, కొత్తవారికి కండిషన్ తెలియకపోవడంతో బస్సులను అలానే బయటకు తీసుకొస్తున్నారు. సంగారెడ్డి బస్సు డిపోలో ప్రైవేట్ వ్యక్తుల సహాయంతో నడిపేందుకు సిద్ధం అయ్యింది. అయితే, బస్సు చక్రాలకు బోల్టులను సరిగా ఫిట్ చేయకుండా డిపో నుంచి బస్సును బయటకు తీసుకొస్తున్న సమయంలో బయట ధర్నా చేస్తున్న సిబ్బంది బస్సును గమనించి విషయాన్ని అధికారులకు తెలిపారు.
వెంటనే బస్సును వెనక్కి తీసుకెళ్లి బోల్టులు ఫిట్ చేశారు. ప్రైవేట్ వ్యక్తులు బస్సులు నడుపుతుండటంతో ప్రజలు భయం భయంగా ఉంటున్నారు. కొత్త వ్యక్తులు బస్సులను ఎలా నడుపుతారో అని భయపడుతున్నారు. బస్సు ఎక్కిన తరువాత ప్రజల ప్రాంతాలన్నీ బస్సు డ్రైవర్ చేతిలో ఉంటాయి. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా గమ్యస్థానానికి చేరడం అటుంచితే.. పరలోకానికి చేరడం ఖాయం అని అంటున్నారు ప్రయాణికులు. ప్రభుత్వం వీలైనంత త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.