కెసిఆర్ ముఖ్యమంత్రిగా రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్టీసీపై మంచి నిర్ణయం తీసుకుంటారని ఎదురు చూసినట్టు కార్మికులు పేర్కొన్నారు. కానీ, అందుకు విరుద్ధంగా కెసిఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని, నియంతలా ప్రవర్తిస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. కార్మిక సంఘాలతో అవసరం లేదని, వారి అవసరం లేకుండానే బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పైగా, కొత్తగా ఉద్యోగాల్లో జాయిన్ కాబోయే ఉద్యోగులు ఎలాంటి కార్మిక సంఘాల్లో జాయిన్ కాబోమని ముందుగా సంతకం చేయించుకునేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది.
దీనిపై కూడా కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ప్రజాస్వామ్య దేశంలో కార్మికులు తమ హక్కుల కోసం పోరాటం చేయడంలో తప్పులేదని, కానీ, ఇలా నిరంసకుశంగా అణిచివేయాలని చూడటంలో అర్ధం లేదని కార్మిక సంఘాలు అంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో కార్మికులే ముందుండి పోరాటం చేశారని. పోరాటం విలువ ఏంటో కార్మికులకు తెలుసునని అంటున్నారు.
కార్మికుల డిమాండ్లను ఎలా నెరవేర్చుకోవాలో తెలుసునని, ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడితే తలొగ్గేది లేదని అంటున్నారు కార్మికులు. ఇందిరాపార్క్ వద్ద ధర్నాస్థలిలో ధర్నా చేస్తామని అంటోంది. అయితే, అక్కడ దీక్ష చేసేందుకు అనుమతి లేదని చెప్పి ప్రభుత్వం చెప్పడమే కాకుండా పోలీసులు కూడా ఇదే విషయాన్నీ స్పష్టం చేస్తున్నారు. ధర్నాకు అనుమతి లేదని, ధర్నాకు దిగితే.. అరెస్ట్ చేస్తామని అంటున్నారు.
తెలంగాణ సాధన కోసం పోరాటం చేసిన వ్యక్తులకు ప్రభుత్వం ఇస్తున్న గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇలానే పనిచేస్తే.. గతంలో ముఖ్యమంత్రులకు జరిగిన గతి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రికి కూడా పడుతుందని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఆర్టీసీ ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నార్నయి, ఆర్టీసీ ఆస్తులపై కెసిఆర్ కన్నేశారని కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు. అక్టోబర్ 21 వ తేదీన ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో ఇలాంటి రగడ జరగడం తెరాస పార్టీకి నష్టాన్ని కలిగించేలా ఉన్నది.