ఆర్టీసీలో కార్మికుల సంఘాలు అవసరం లేదని, వారి అవసరం లేకుండానే బస్సులను నడపాలని, ఉద్యోగులను పర్యవేక్షించాలని ప్రభుత్వం చూస్తుంది. వేలాది మంది ఉద్యోగులకు సంబంధించిన విషయాలు చూసుకోవడానికి యూనియన్లు ఉంటాయి. ఇప్పుడు యూనియన్ల అవసరం లేకుండానే పనులను చక్కదిద్దే విధంగా తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అవుతున్నది. అంటే ఆర్టీసీలో ఇకపై కార్మిక సంఘాలు ఉండబోవు. దీని అర్ధం ఏంటి.. ఎవరైనా సరే డిమాండ్ల సాధన అని ఇకపై ధర్నాలు చేస్తే వారి సంఘాలను రద్దు చేస్తామని అని చెప్పడమే కదా.
రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు వివిధ రంగాలలో పనిచేస్తున్నారు. ఆయా రంగాలకు సంబంధించిన కార్మిక సంఘాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఈ సంఘాల మనుగడకు ముప్పు వాటిల్లే అవకాశం లేకపోలేదు. రాష్ట్రంలో ఆర్టీసీ, సింగరేణి సంస్థలకు కార్మికుల సంఘాలు ఎక్కువుగా ఉంటాయి. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నది కాబట్టి దానిని ప్రభుత్వంలో విలీనం చేయలేదు.
దసరా బోనస్ వంటివి ఇవ్వలేదు. ఇప్పటి వరకు జీతాలు కూడా చెల్లించలేదని కార్మిక సంఘాలు చెప్తున్నాయి.
ఇక ఇదిలా ఉంటె, సింగరేణి లాభాల్లో నడుస్తున్న సంస్థ.. అక్కడ కార్మికులు ధర్నాలు చేయరు. ఎలాంటి డిమాండ్లు ఉన్నా అక్కడి యాజమాన్యం వాటిని పరిష్కరిస్తోంది. కారణం లాభాల్లో ఉండటమే. ఒకవేళ సింగరేణికి నష్టాలు వస్తే అక్కడి కార్మికుల పరిస్థితి కూడా ఇలానే ఉంటుందా.. ఇప్పుడు సింగరేణి కార్మిక సంఘాల ముందుకు ఓ ప్రశ్న వచ్చింది. తోటి ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్లు నెరవేర్చుకోవడం కోసం ధర్నా చేస్తున్నాయి.
మరి ఈ సమయంలో ఆర్టీసీ కార్మికులకు సింగరేణి కార్మిక సంఘాలు మద్దతు ఇస్తాయా లేదంటే.. విషయం తమది కాదు కాబట్టి ఎందుకు వచ్చిన గొడవలే అని సైలెంట్ గా ఉంటాయా అన్నది తెలియాలి. ఒక్క సింగరేణి మాత్రమే కాదు.. రాష్ట్రంలో చాలా కార్మిక సంఘాలు ఉన్నాయి. అవికూడా ఆర్టీసీ కార్మిక సంఘాలకు మద్దతు ఇస్తే.. బాగుంటుందని ఆర్టీసీ కార్మిక సంఘాలు అంటున్నాయి. ఒకవేళ వాళ్ళు కూడా వీరికి మద్దతు ఇస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది.