చిన్న చిన్న మనస్పర్థలు కొన్ని కాపురాల్లో చిచ్చు రేపుతూంటాయి. కొన్ని కుటుంబంలోనే సమసిపోతే మరికొన్ని రచ్చకెక్కుతాయి. మరికొన్ని విడిపోయేవరకూ వెళితే మరికొన్ని ప్రాణాలు తీసుకునేవరకూ వెళతాయి. ఇటువంటి ఘటనే ప్రకాశం జిల్లాలో జరిగింది. పెళ్ళై ఆరునెలలు గడవకముందే ఆ ఇంట్లో తీవ్ర విషాదం నింపింది. ఆ కొత్త జంట మధ్య దసరా పండగ వివాదం రేపింది. 

 

 

 

పండగకు పుట్టింటికి వెళ్లే విషయంలో భార్య భర్తల మధ్య జరిగిన వాదన  ఆమె ఆత్మహత్యకు దారితీసింది.  పెళ్లయిన ఐదు నెలలకే మనస్తాపంతో భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రకాశం జిల్లా టంగుటూరులోని శ్రీనివాస్ నగర్‌కు చెందిన కుంచాల వరుణ్‌కు కందుకూరు మండలం పలుకూరుకు చెందిన మౌనిక(21)కు అయిదు నెలల కిత్రం వివాహం జరిగింది. కుమార్తె, అల్లుడిని దసరా పండగకు ఇంటికి ఆహ్వానించేందుకు మౌనిక తండ్రి రెండు రోజుల క్రితం కూతురు ఇంటికి వెళ్లి పండుగకు ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించారు . ఈ సందర్భంగా పుట్టింటికి వెళ్లే విషయంలో మౌనిక భర్తతో గొడవపడింది. తీవ్ర మనస్తాపంతో ఆదివారం భర్త బయటకు వెళ్లిన సమయంలో మౌనిక గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న మౌనిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

 

 

 

కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన వరుణ్ కు భార్య ఫ్యాన్‌కు వేలాడటాన్ని గమనించి షాకయ్యాడు. వెంటనే తేరుకున్న వరుణ్  పోలీసులకు ఫోన్ చేసి సమాచారమిచ్చాడు. దీంతో ఎస్సై రమణయ్య సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అయితే.. ఆత్మహత్యకు సంబంధించి కారణాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం మౌనిక మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనతో వారి కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: