మహాత్మాగాంధీ 150 వ జన్మదినం సందర్భంగా భారత్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇండియాను ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చాలని
మోడీ నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని హ్యూస్టన్ సభలోను, అలానే ఐరాసలోను పేర్కొన్నారు. అక్టోబర్ 2 వ తేదీ నుంచి దీన్ని అమలు చేస్తున్నారు. ప్రధాని ప్రకటించిన ప్లాస్టిక్ బ్యాన్ కు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ప్రజలు స్వచ్చందంగా ప్లాస్టిక్ బ్యాన్ చేస్తున్నారు.
ఇంట్లో ఉన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిల్స్ ను బయటపడేస్తున్నారు. ఏవైనా తీసుకురావాలి అని బయటకు వెళ్తే వెళ్లేసమయంలోనే కూడా బ్యాగులు తీసుకెళ్తున్నారు. ప్లాస్టిక్ నిషేదంలో తమవంతు కృషిగా ప్రయత్నాలు చేస్తున్నారు. పర్యావరణ సమతుల్యతకు ప్లాస్టిక్ ఒక కారణం అని చెప్పి దాన్ని నిషేధించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. పర్యావరణం దెబ్బతింటే.. దాని వలన వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తాయో అందరికి తెలిసిందే.
ఇప్పటి వరకు ఈ భూమి ఐదుసార్లు పర్యావరణంలో లోపాల కారణంగానే అంతం అయ్యింది. ఇప్పుడు అదే పరిష్టితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే వీలైనంత త్వరగా భూమిపై పర్యావరణాన్ని రక్షించుకోవాలని ప్రపంచదేశాలు పిలుపునిస్తున్నాయి. ఇదిలా ఉంటె, ప్రధాని పిలుపు మేరకు అరుణాచల్ ప్రదేశ్ లోని ఓ మాంసం వ్యాపారి ప్లాస్టిక్ ను నిషేదించారు.దాని స్థానంలో ఆకులను వినియోగిస్తున్నాడు.
అరుణాచల్ ప్రదేశ్ లేపా రాడా జిల్లాలోని తిర్బిన్ గ్రామంలో ఉన్న మాంసం వ్యాపారి అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ వినియోగాన్ని బ్యాన్ చేశాడు. తనదగ్గరకు మాంసం, చేపలు వగైరా కొనుగోలు చేసే వ్యక్తులకు వాటిని ఆకుల్లో కట్టి ఇస్తున్నాడు. ఆకులో ఏదోలా కాకుండా చాలా అందంగా కట్టి తీసుకెళ్లేందుకు వీలుగా అందిస్తున్నాడు. ప్యాకింగ్ విధానం వినియోగదారులకు బాగా నచ్చింది. అతని దగ్గరే మాంసం, చేపలు కొనేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి రిజుజు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.