ఆర్థికమాంధ్యం దేశంలో ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియజెప్పేందుకు ఈ క్రమంలో ప్రభావితం అవుతున్న అనేక రంగాలే ఉదాహరణ. అయితే, దీనికి కొనసాగింపుగా ఉద్యోగాలు ఊస్ట్ అవుతుండట అనే పరిణామాలు ప్రారంభం అవుతున్నాయి. గత నెల టొయోటా అమ్మకాలు 16.56 శాతం క్షీణించి 10,911 యూనిట్లకు పరిమితమయ్యాయి. మార్కెట్లో పడిపోయిన వాహన విక్రయాలు, దేశీయ
ఆటో రంగంలో నెలకొన్న మందగమనం నేపథ్యంలో టొయోటా కిర్లోస్కర్ మోటర్ (టీకేఎం)...తమ ఉద్యోగులకు వీఆర్ఎస్ పథకాన్ని తీసుకొచ్చింది.
జపాన్కు చెందిన టొయోటా, భారత్కు చెందిన కిర్లోస్కర్ గ్రూప్ కలిసి టీకేఎంను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా టీకేఎంకు దాదాపు 6,500 మంది ఉద్యోగులున్నారు. కర్నాటకలోని బిదాడిలో రెండు ప్లాంట్లున్నాయి. 3.10 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పాదక సామర్థ్యం వీటి సొంతం. అయితే, మార్కెట్లో ఉన్నఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో...బిదాడి ఉత్పాదక కేంద్రంలో వీఆర్ఎస్ను అమలుపరుస్తున్నారు. గత నెల 22న మొదలైన ఈ నవ జీవన యోజన స్కీం...ఈ నెల 23 వరకు నెల రోజులపాటు అందుబాటులో ఉంటుందని టీకేఎం వర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఇది పూర్తిగా స్వచ్చంధమని, టీకేఎం మార్కెట్ పరిస్థితులకు, దీనికి ఎలాంటి సంబంధం లేదని సంస్థ వైస్ చైర్మన్
శేఖర్ విశ్వనాథన్ పీటీఐకి స్పష్టం చేశారు.
ఇదిలాఉండగా, ఇటీవల
టయోటా దేశీయ మార్కెట్లోకి ప్రీమియం హ్యాచ్బ్యాక్ గ్లాంజాను విడుదల చేసింది. ఈ కారు ధరను రూ.7.22 లక్షల నుంచి రూ.8.9 లక్షల మధ్యలో నిర్ణయించింది. బీఎస్-6 ప్రమాణాలకు లోబడి 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్తో తయారైన ఈ కారులో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ను ఎంపిక చేసుకునే అవకాశం కూడా వినియోగదారులకు కల్పించింది. ఈ సందర్భంగా
టయోటా కిర్లోస్కర్ మోటార్ ఎండీ మసకజు యోషిమురా మాట్లాడుతూ..డైనమిక్ మార్కెట్లాంటి భారత్లోకి ఈ నూతన కారును విడుదల చేసినట్లు, వినియోగదారులు కోరుకుంటున్న అన్ని రకాల ఫీచర్స్ దీంట్లో ఉన్నాయన్నారు. ఈ కారుపై మూడేండ్లు/లక్ష కిలోమీటర్ల వ్యారెంటీని ఐదు సంవత్సరాలు/2.2 లక్షల కిలోమీటర్లకు పెంచింది.మారుతికి చెందిన బాలెనో వెర్షన్లాగా ఈ కారు ఉంది. ప్రస్తుతం
మారుతి సుజుకీ..నాలుగు రకాలు కలిగిన పెట్రోల్, డీజిల్ ఇంజిన్తో తయారైన బాలెనోను విక్రయిస్తున్నది.