రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలైంది. అయితే, త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించే ఈ ఎన్నికలు బహుశ వచ్చే ఏడాది జరగనున్నాయి. ఇక, ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార వైసీపీ గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకు నడుస్తున్న విషయం తెలిసిందే. గ్రామ వలంటీర్లు, ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోంది.
ఈ క్రమంలోనే స్థానిక సంస్తల ఎన్నికల్లో బలోపేతం అయ్యేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని పక్కన పెట్టి.. స్థానికంగా పుంజుకునేందు కు ఉన్న అన్ని అవకాశాలను కూడా ఆయన వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితిలోటీడీపీ తరఫున పోటీ చేసేందుకు కార్పొరేట్ స్తాయి నేతలే లేని పరిస్థితి కొన్ని జిల్లాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఏదో దొరికారు కదా! అన్నట్టు వచ్చిన వారికి వచ్చినట్టు నియామకాలు చేస్తే.. స్థానిక సంస్థల్లో టీడీపీ గెలిచినా.. తర్వాత పరిణామాలు అనూహ్యంగా వైసీపీకి కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు పార్టీలోని సీనియర్లు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇంచార్జులను నియమించి స్థానిక సంస్థలపై పట్టు సాధించాలి. ఈ క్రమంలోనే పార్టీలో తమ జీవితాన్ని త్యాగం చేసిన, నిబద్దతతో వ్యవహరించిన నాయకులకు మాత్రం చంద్రబాబు ఛాన్స్ ఇవ్వాలి.
లేక పోతే.. మొహమాటాలకు పోయి.. స్తానికంగా కూడా ఎవరికి పడితే.. వారికి అవకాశం ఇస్తే.. తర్వాత వారు గెలిచినా.. వైసీపీలోకి జంప్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని టీడీపీ పరిశీలకులు చెబుతున్నారు. మరిబాబు ఏం చేస్తారో చూడాలి.