తాజా పరిణామాలను పరిస్తుంటే.. మొత్తానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆర్టీసీ కార్మికులకు లోగుతున్నట్టుగానే కనిపిస్తుందిగా. ఆర్టీసీని పూర్తిగా ప్రయివేటీకరణ చేయడం ప్రభుత్వానికి ఏ మాత్రం ఇష్టం లేదనడం ఆశ్చర్యకరం. ఆర్టీసీ సంస్థ వుండి తీరాల్సిందేనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్టీసీని పటిష్టపరచడానికి అనేక చర్యలు చేపట్టుతున్నామని అన్నారు. మొత్తం ఆర్టీసీని ప్రయివేట్ పరం చేయడం వివేకమైన చర్య కాదని కూడా ఆయన అన్నారు. క్రమశిక్షణను తుచ తప్పకుండా అమలు చేసి ఆర్టీసీని లాభాల బాటలో నడిపించడానికి చర్యలు తీసుకుంటున్నామని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఆర్టీసీకి సంబంధించిన ప్రతిపాదనలను తయారు చేసి ముఖ్యమంత్రికి అందచేశారు.



సోమవారం ఆ ప్రతిపాదనలను ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో చర్చించారు. ఈ సందర్బంగా  చర్చించిన, నిర్ణయం తీసుకున్న మరికొన్ని అంశాలు ఇదిలా ఉన్నాయి.  దురహంకార పూరితంగా సమ్మెకు పోవడానికి కారణం యూనియన్ల మోనోబలి భావనే. ఇష్టం వచ్చిన రీతిలో సమ్మె చేస్తామనడం దురహంకారం.  ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏ సంస్థలో ఏది జరిగినా అది ప్రభుత్వ అనుమతితోనే జరగాలి.విధుల్లోకి రానివారు ఆర్టీసీ సిబ్బందిగా పరిగణించనప్పుడు ఇక యూనియన్ల ప్రసక్తే  లేదు. యూనియన్లు వాటి అస్తిత్వాన్ని కోల్పోయాయి. భవిష్యత్ లో ఇక ఆర్టీసీలో యూనియనిజం వుండదు. భవిష్యత్ లో ఆర్టీసీ అంటే ఒక అద్భుతమైన సంస్థగా రూపు దిద్దుకోవడమే. ఆర్టీసీ భవిష్యత్తులో లాభాలకు వచ్చి కార్మికులకు (కొత్తగా చేరేవారికి) బోనస్ ఇచ్చే పరిస్థితికి రావాలి. సంస్థ లాభాల్లో నడవాలి.. నష్టాల్లోకి పోకూడదు.



ఆర్టీసీకి కొత్త నెత్తురు, జవసత్వాలు రావాలి.  రవాణా రంగంలో రోజు రోజుకూ పెరుగుతున్న పోటీ నేపథ్యంలో మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థగా దేశంలోనే పేరుగాంచిన ఆర్టీసి సంస్థ, తన సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తూనే ఆర్థిక పరిపుష్టిని సాధించుకుని లాభాల బాట పయనించడానికి తీసుకోవాల్సిన చర్యల మీద సూక్ష్మ దృష్టి సారించాల్సిన అవసరమున్నది. ఆర్టీసీ నిరంతరం చైతన్యంతో ప్రజలకు సేవలు అందించే సంస్థ. పండుగలు పరీక్షలు వంటి కీలక సమయాల్లో కార్మిక సంఘాలు సమ్మెలకు పిలుపిచ్చి ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగించే పరిస్థితులు కొనసాగుతున్నయి. వాటిని రూపుమాపి ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సమావేశం నిర్ణయించింది. ఈ  సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపి మహేందర్ రెడ్డి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగ్ రావు, రవాణా శాఖ కమీషనర్ సందీప్ సుల్తానియా, అడిషనల్ డీజీపీ జితేంద్ర, తదితర ఆర్టీసీ, రవాణా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



“ప్రస్తుతం ఆర్టీసీలో 10,400 బస్సులున్నాయి. వీటిని భవిష్యత్ లొ మూడు రకాలుగా విభజించి నడపాలి. 50% బస్సులు అంటే 5200 పూర్తిగా ఆర్టీసీకి చెందినవై, ఆర్టీసీ యాజమాన్యంలోనే వుంటాయి. 30% బస్సులు, అంటే 3100 బస్సులు అద్దె రూపేణా తీసుకుని వాటిని కూడా పూర్తిగా ఆర్టీసీ పర్యవేక్షణలోనే, ఆర్టీసీ పాలన కిందే నడపడం జరుగుతుంది. వాటిని వుంచడం కూడా ఆర్టీసీ డిపోలలోనే. మరో 20% బస్సులు అంటే 2100 బస్సులు పూర్తిగా ప్రయివేటువి, ప్రయివేట్ స్టేజ్ కారేజ్ విగా అనుమతి ఇస్తారు. ఈ బస్సులు పల్లెవెలుగు సర్వీసు కూడా నడపాలి. అద్దెకు తీసుకున్న బస్సులు, స్టేజ్ కారేజ్ బస్సులు ఇతర రూట్లతో పాటు నగరంలొ కూడా నడపాలి. ఆర్టీసీ చార్జీలు, ప్రయివేట్ బస్సుల చార్జీలు సమానంగా, ఆర్టీసీ నియంత్రణలోనే వుంటాయి.



వాళ్ల చార్జీలు కూడా ఆర్టీసీ పెంచినప్పుడే పెంచడం జరగాలి. స్వల్పంగా పెంచడానికి కూడా ఆర్టీసీ కమిటీ నిర్ణయం మేరకు అవసరం అని భావించినప్పుడు చేయాలి. ఇప్పటికీ 21%  అద్దెబస్సులను ఆర్టీసీ నడుపున్నది. అంటే, ఇక అద్దెకు తీసుకోవాల్సింది అదనంగా మరో 9% మాత్రమే. అదనంగా 9% అద్దె బస్సులను పెంచడం అంటే ఆర్టీసీకి కొత్త బస్సులు వచ్చినట్లే” అని అన్నారు. “ఈ చర్యలన్నీ చేపట్టడానికి ప్రధాన కారణం ఆర్టీసీ యూనియన్ల అతిప్రవర్తనే. తాము ఎక్కిన చెట్టు కొమ్మను తామే నరుక్కున్నారు. గత 40 సంవత్సరాలుగా జరుగుతున్న దాష్టీకం వల్ల ఇదంతా చేయాల్సి వచ్చింది. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలలో సమ్మె చేసిన ఆర్టీసీ యూనియన్లు, టీఅరెస్ ప్రభుత్వంలో కూడా సమ్మెకు దిగారని సీఎం కేసీఆర్ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: