న‌ల్ల‌ధ‌నం విష‌యంలో కీల‌క స‌మాచారం ఇది. బ‌డా బాబుల బ్లాక్‌మెయిల్ దందాలో..ఊహించ‌ని ట్విస్ట్‌.  స్విస్‌ బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న భారతీయుల ఖాతాల వివరాలు కేంద్ర ప్రభుత్వానికి అందాయి. ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకునే విధానం (ఏఈవోఐ) కింద స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెడరల్‌ ట్యాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌టీఏ) తొలి విడుత సమాచారాన్ని భారత్‌కు అందజేసింది.  దీంతో కేంద్రం తీసుకునే చ‌ర్య‌ల‌పై ఈ బ్లాక్‌మెయిల్ క‌ల‌వ‌రం మొద‌లైంది. 


నల్లధనం దాచుకునేందుకు స్విస్‌ బ్యాంకులు స్వర్గధామంగా మారాయన్న ఆరోపణల నుంచి బయటపడేందుకు 2017లో ఆ దేశం చర్యలు చేపట్టింది. నల్ల ధనం వెలికితీత కోసం భారత్‌తోసహా 75 దేశాలతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెడరల్‌ ట్యాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌టీఏ) అధికారులు ఆగస్టులో ఢిల్లీకి వచ్చిన స‌మ‌యంలో ఈ వివరాలను ఏఈవోఐ కింద కేంద్రానికి ఇచ్చినట్టు సమాచారం. ఆ దేశం నుంచి తొలిసారిగా అందిన వివరాల్లో 2018లో భారతీయ ఖాతాదారులు జరిపిన లావాదేవీలతోపాటు ఖాతాల మూసివేతకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నట్టు స‌మాచారం. స్విట్జర్లాండ్‌ నుంచి భారత్‌కు అందిన తొలి విడుత వివరాల్లో ఎక్కువగా ప్రవాస భారతీయుల వివరాలు ఉన్నట్టు సమాచారం. ఖాతాదారుని పేరు, చిరునామా, ఖాతాలోని నగదుకు సంబంధించిన వివరాలను అందజేసినట్టు ఎఫ్‌టీఏ అధికారి ఒకరు పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. అయితే సమాచారాన్ని రహస్యంగా ఉంచాలన్న నిబంధన ఉండటంతో ఒక వ్యక్తి లేదా సంస్థకు ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉన్నాయి, వాటిల్లో కలిపి మొత్తం ఎంత నగదు ఉన్నది అన్న వివరాలు వెల్లడించబోమని ఆయన చెప్పారు. 


ప్రభుత్వం కన్నుగప్పి సంపాదించిన తమ అక్రమ సంపదను విదేశాల్లో దాచుకోవాలనుకునే అవినీతిపరులకు స్విట్జర్లాండ్ వంటి దేశాలు స్వర్గధామాలుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే నల్లధనం వెలికితీతే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ఈ దేశాలన్నింటితో సమాచార మార్పిడి ఒప్పందాలను కుదుర్చుకున్నది. ఈ క్రమంలోనే స్విట్జర్లాండ్‌లోని భారతీయుల సంపద వివరాలను కేంద్రం పొందగలుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: