ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల కోసం వాహనమిత్ర పథకం ప్రవేశపెట్టింది జగన్ సర్కార్. ఏలూరులో జగన్ చేతుల మీదుగా పథకం ప్రారంభమయ్యింది.. అదే రోజు విజయవాడలో పోలీసులు, ఆర్టీఏ అధికారులు ఆటోలను ఆపి మరీ ‘వాహనమిత్ర’ ఇచ్చినందుకు థ్యాంక్యూ అన్నట్టుగా జగన్, వైఎస్ ఫొటోలతో ఉన్న స్టిక్కర్లు అతికించడం వివాదాస్పదం అవుతోంది. యూనిఫాంలో ఉన్న పోలీసులు ఆటోలను ఆపి మరీ స్టిక్కర్లు అతికించడం ఏంటని టీడీపీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు.

 

జగన్ సర్కార్‌పై ట్విట్టర్‌లో ఘాటు వ్యాఖ్యలు చేశారు కన్నా లక్ష్మీనారాయణ. ‘బాబుకి మీకు ఏమి తేడా జగన్?. ఆయన కేంద్ర పథకాలకు స్టిక్కర్ వేసాడు, మీరు అంతకుమించి అధికార దుర్వినియోగం చేస్తూ పోలీసులను పార్టీ కార్యకర్తలుగా చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు మీ పార్టీ రంగులేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మీకు ఓటు వేసిన పాపానికి కార్మికులను రోడ్డున పడేశారు’ అంటూ ఘాటుగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

 

పోలీసులు, ఆర్టీఏ అధికారులు ఇలా ఆటోలపై స్టిక్లర్లు అంటిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తెలుగు తమ్ముళ్లు జగన్ సర్కార్ టార్గెట్‌గా రెచ్చిపోతున్నారు. తాజాగా బీజేపీ కూడా స్పందించింది. మరి ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: