విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన శ్రీ స్వరూపానందేంద్ర స్వామిజీ ఇపుడు రాజకీయ నాయకులకు పెద్ద దేవుడు అయిపోయారు. వైసీపీ నేతలైతే తరచూ ఆయన్ని కలుసుకుంటున్నారు. ఇక వేరే పార్టీలకు చెందిన నేతలు పార్టీ మారాలనుకుంటున్న వారు సైతం స్వామిజీ ఆశ్రమానికి వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం విశేషం. ముఖ్యమంత్రి జగన్ కి అత్యంత సన్నిహితులు స్వామీజీ అన్న ముద్ర ఉండడంతో తమ గురించి నాలుగు మంచి మాటలు చెబుతారన్న ఉద్దేశ్యంతోనే స్వామి ఆశ్రమానికి రాజకీయ జీవులు క్యూ కడుతున్నారంటున్నారు. రాజకీయ భక్తులతో పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.
ఇదిలా ఉండగా విశాఖ జిల్లాకు చెందిన
మంత్రి అవంతి
శ్రీనివాస్ స్వామిజీతో తరచూ భేటీ అవుతారు. వెళ్ళినపుడల్లా స్వామీజీతో చాల సేపు మంత్రి అవంతి మంతనాలు జరపడం రివాజుగా మారింది. అదే విధంగా జిల్లా రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు కూడా స్వామిజీతో
మంత్రి పంచుకుంటారని ప్రచారంలో ఉంది. అదే విధంగా మరో వైపు మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు
శ్రీనివాస్ కూడా స్వామిని ఎక్కువగా దర్శించుకుని చర్చలు జరుపుతారు ఇక వైసీపీలోకి మారుతారని ప్రచారంలో ఉన్న విశాఖ రూరల్ జిల్లా టీడీపీ ఇంచార్జి పంచకర్ల రమేష్ బాబు సైతం స్వామి ఆశీర్వాదం కోసం ఈ మధ్యనే ఆశ్రమానికి రావడం విశేష పరిణామంగా చెప్పుకోవాలి.
ఇక కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన నేతలు సైతం స్వామీజీ దర్శనానికి రావడం గమనార్హం. ఇదిలా ఉండగా తన దగ్గరకు ఎవరు వచ్చినా వారు ఏ పార్టీ అన్నది చూడనని, కేవలం భక్తులుగానే వారిని చూస్తానని స్వామీజీ ఇప్పటికే చెబుతూ వచ్చారు. పైగా రాజకీయాల గురించి ఏ మాత్రం చర్చకు అవకాశం లేదని కూడా స్వామీజీ అంటున్నారు. అయితే స్వామి ఎంత చెప్పినా అధికార పార్టీ నేతలు నిత్యం అక్కడ క్యూ కట్టడం బట్టి చూస్తూంటే స్వామీజీ ప్రభావం మామూలుగా లేదని అంటున్నారు.