ఆంధ్రప్రదేశ్ లో మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టనున్నారు సీఎం జగన్. రేపు అనంతపురం జిల్లాలో వై.ఎస్.ఆర్ కంటి వెలుగు పథకాన్ని జగన్ ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద దాదాపు 5 కోట్ల 40 లక్షల మందికి నేత్ర పరీక్షలు చేసి.. అవసరమైన చికిత్సను అందించనుంది ఏపీ సర్కార్.
ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ మరో కీలక పథకాన్ని అమలు చేయడానికి సిద్ధం అయింది. రేపు అనంతపురం జిల్లాలో కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించనున్నారు జగన్. వైఎస్సార్ కంటి వెలుగులో భాగంగా మొదటి విడతలో సుమారు 70 లక్షల బడిపిల్లలకి ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించనునున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రపంచ దృష్టి దినం సందర్భంగా రేపటి నుంచి ఈ నెల 16 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. కంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్టుగా గుర్తించిన వారిని నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకూ విజన్ సెంటర్లకు పంపిస్తారు. కలెక్టర్లు ఛైర్మన్లుగా వ్యవహరిస్తున్న టాస్క్ఫోర్స్ కమిటీలు జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాయి.
పథకం అమలకు కావాల్సిన సిబ్బందిని ఇప్పటికే నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇందులో భాగంగా 160 మంది జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్లు, 14 వందల15 మంది వైద్యాధికారులు పధకం అమలులో భాగస్వాములు అవుతున్నారు. రాష్ట్రంలోని పీహెచ్సీలకు కంటిపరీక్షలకు సంబంధించిన కిట్లను ఇప్పటికే పంపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆశావర్కర్లు, టీచర్లు, ఏఎన్ఎంలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. ఆరు నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటానన్న సీఎం జగన్ అనుకున్నట్టుగానే మంచి పథకాలతో ప్రజాధరణ పొందుతున్నారు. ఎవరూ ఊహించని స్కీమ్ లతో తన పాలనను కొనసాగిస్తున్నారు. మొన్నటికి మొన్న తన పాదయాత్రలో ఇఛ్చిన మాట ప్రకారం ఆటో డ్రైవర్లకు పదివేల రూపాయలు ఇచ్చి మాట నిలబెట్టుకున్న జగన్.. ఇపుడు పేద ప్రజలకు కంటి వెలుగవుతున్నారు.