ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంభిస్తోన్న కఠిన వైఖరికి కారణం ఏమిటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు . సమ్మె పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం ద్వారా పరోక్షంగా కార్మికులను రెచ్చగొడుతోందన్న వాదనలు లేకపోలేదు . ఈ పరిణామాలు దీర్ఘకాలం లో అధికార టీఆరెస్ కు ఏమాత్రం లాభించవని తెలిసి కూడా,  కేసీఆర్ ఎందుకిలా వ్యవహరిస్తున్నారన్న దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది . ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టడం ద్వారా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆరెస్ కు నష్టమే తప్పా ఎంతమాత్రం లాభం చేకూరే అవకాశం  లేదన్నది నిర్వివాదాంశమే. 


 అయినా కేసీఆర్ ఎందుకింత మొండిపట్టుదలకు పోతున్నారన్నది రాజకీయ పరిశీలకులు సైతం అంచనా వేయలేకపోతున్నారు . హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ కి గెలుపు అత్యవసరం . ఎందుకంటే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆరెస్ నాయకత్వం ఆశించిన స్థాయి లో ఫలితాలు రాకపోవడం తో , రాష్ట్రం లో బీజేపీ పుంజుకునే అవకాశాలు ఏర్పడ్డాయి . అసెంబ్లీ ఎన్నికల్లో 103  స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన బీజేపీ , లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు స్థానాలు గెల్చుకుని అధికార పార్టీ కి గట్టి సవాల్ విసిరింది . లోక్ సభ ఎన్నికల అనంతరం ఇతర పార్టీల నుంచి బీజేపీ లోకి వలసలు కూడా పెరిగిన నేపధ్యం లో , హుజూర్ నగర్ ఉప ఎన్నిక గెలుపు తమకు ఎంతో అవసరమని తెలిసి కూడా , కేసీఆర్ కొరివితో తల గోక్కుంటున్నారనే విమర్శలు లేకపోలేదు .


 ఈ ఉప ఎన్నికల్లో టీఆరెస్ అభ్యర్థి ఓటమి పాలయితే , రానున్న రోజుల్లో అధికార పార్టీ భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని కేసీఆర్ కు తెలియనిది కాదని , అయినా ఆర్టీసీ కార్మికుల సమ్మెపై  ఆయన ఎందుకు మొండిపట్టుదలకు పోతున్నారో అంతు చిక్కడం లేదంటున్నారు .  


మరింత సమాచారం తెలుసుకోండి: