కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఎన్నో కొత్త పథకాలను ఆరంభించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈరోజు నుంచి అంటే అక్టోబర్ 10 నుంచి మరో మంచి కార్యక్రమానికి జగన్ స్వీకారం చుడుతున్నారు. అదే కంటి వెలుగు పథకం. ప్రజా సంక్షేమం దిశలో పడ్డ మరో అడుగే వైయస్ఆర్ కంటి వెలుగు.
అక్టోబర్ 10న ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న వైయస్ఆర్ కంటి వెలుగు సీఎం వైయస్ జగన్ ప్రజా సంక్షేమ పాలనలో ప్రసరిస్తున్న మరో వెలుగు కిరణంగా చెప్పుకోవచ్చు. ఈ నెల 10న వైయస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అనంతపురం జిల్లా వేదికగా ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
కంటి వెలుగు పథకం కింద ఉచితంగా పరీక్షలు, వైద్యసేవలు, కంటికి శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. ఈ పథకం మొత్తం మూడేళ్లపాటు అమలవుతుంది. కంటి వలుగు పథకాన్ని 5 దశల్లో అమలు చేస్తారు.. పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్ల్ ఛైర్మన్గా టాన్క్ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కంటి వెలుగు పథకాన్ని తొలి రెండు దశల్లోవిద్యార్థులకు అమలు చేస్తారు.
తర్వాత మిగిలిన మూడు, నాలుగు, ఐదు దశల్లో కమ్యూనిటిబేస్ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. పథకంలో భాగంగా స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్ శస్త్ర చికిత్స, ఇతరత్రా అవసరమైన పరీక్షలను నిర్వహిస్తారు. కంటి వెలుగుకు సంబంధించిన సామగ్రి, పరికరాలు, మందుల్ని సిద్ధం చేశారు. కంటి వెలుగు పరీక్షల నిర్వహణ, వసతుల కల్పనకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు.
తమ నాయకుడు నిరంతరం ప్రజల కోసం ఆలోచించడం వల్లే ఇలాంటి పథకాలు అమలవుతున్నాయని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. సీఎం అయిన నాలుగు నెలల కాలంలోనే వైయస్ జగన్ మోహన్ రెడ్డి పథకాలన్నీ ఆ విషయాన్ని చాటుతున్నాయంటున్నారు. పాలకుల్లో పెద్దగా కనిపించని దార్శనికత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సొంతం అని చెప్పుకుంటున్నారు.