ఎంతటి మహారాజు కావొచ్చు.. కటిక నిరుపేద కావొచ్చు.. ఆకలేస్తే పిడికెడు భోజనం తినాల్సిందే. అయితే, తినే భోజనంలో తేడా ఉంటె ఉంటుంది. డబ్బున్న వ్యక్తులు షడ్రుచులతో భోజనం చేస్తారు.. కూటికి లేని వ్యక్తులు మాములుగా ఉన్నదేదో వేసుకొని తింటారు. మధ్యతరగతి వ్యక్తులు ఇంకేదో వండుకొని తింటారు. మాంసాహారం తీసుకునే వ్యక్తులు కోళ్లు, చేపలు ఇలా రకరకాల వాటిని వండుకొని తింటారు. అరబ్ దేశాల్లో అయితే ఒంటెను, విదేశాల్లో అంటే పందిని ఇలా ఆహారంగా తీసుకుంటూ ఉంటారు.
ఎవరైనా గుర్రాన్ని కోసి వండుకొని తిన్న వాళ్ళు ఉన్నారా అంటే.. చాలా అరుదుగా ఉంటారు. మాములుగా గుర్రాలు చనిపోతే వాటిని పూడ్చిపెడతారు లేదంటే కాల్చి వేస్తారు.. కానీ, దాన్ని కోసి వండుకు తినాలి అనే ఆలోచన ఎవరికీ రాదు. రాకపోవడం కాదు.. అసలు ఆలా ఆలోచించరు కూడా. జిహ్వకో రుచి అన్నట్టుగా ఓ యువతి తాను పెంచుకున్న ఓ గుర్రాన్ని ఎంచక్కా కోసుకు తినేసింది.
అంతేకాదు, ఫ్రిడ్జ్ లో ఎంచక్కా ఆ మాంసాన్ని దాచుకున్నది. ఆకలేసినప్పుడల్లా ఆ మాంసాన్ని బయటకు తీసి ఫ్రై చేసుకొని తినేస్తుందట. చదవడానికి కాస్త భయంకరంగా ఉన్నా ఇది నిజం. ఈ నార్వేలో జరిగింది.
నార్వే అంటే మంచు ప్రాంతం. అక్కడ చలి ఎక్కువే. నార్వేకు చెందిన 18 ఏళ్ల పియా ఓల్టెన్ అనే యువతి చిన్న తనంలో ఉండగా వారి తల్లిదండ్రులు ఆమెకు ఓ గుర్రాన్ని బహుకరించారు. అప్పటి నుంచి ఆమెకు ఆ గుర్రం స్నేహితుడిగా మారిపోయింది.
గుర్రం స్వారీ నేర్చుకుంది. ఎంచక్కా ఆ గుర్రం మీదనే స్వారీ చేస్తుండేది. ఎంత గుర్రం అయినా దానికి ఒక వయసు ఉంటుంది కదా. ఆ గుర్రం కూడా వయసు మీదపడటంతో అనారోగ్యం పాలై మరణించింది. మరణించిన ఆ గుర్రాన్ని మట్టిలో పూడ్చిపెట్టడం ఇష్టం లేక ముక్కలుగా కోసి దాచుకున్నారట. గుర్రం మాంసాన్ని వండుకొని తినేస్తున్నారు. పియా ఓల్టెన్ ఆ విషయాన్నీ తన పేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. అలా పోస్ట్ చేస్తూ.. గుర్రం మాంసాన్ని ఎలా వండాలో కూడా తెలియజేసింది. అంతే ఒక్కసారిగా ఆమెపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. చెడామడా తిట్లపురాణం అందుకున్నారు. దీంతో షాక్ అయినా పియా ఆ పోస్ట్ ను డిలీట్ చేసింది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.