ఆంధ్రప్రదేశ్ లోనూ కంటి వెలుగు పథకం నేడు పురుడుపోసుకోనుంది . తెలంగాణలో కంటి వెలుగు పథకం గ్రాండ్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా లబ్ది పొందారు . ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా వైయస్ జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వినూత్నమైన పథకాలు ప్రవేశ పెడుతూ అందరి మన్నలను చూరగొంటున్నారు. ప్రజారోగ్య రంగంలో మరో విప్లవాత్మకమైన కార్యక్రమానికి నేడు అనంతపురం జిల్లాలో ఆయన శ్రీకారం చుట్టనున్నారు .
వైస్సార్ కంటి వెలుగు పథకం కింద రాష్ట్రంలోని 5 .40 కోట్ల మందికి నేత్ర పరీక్ష తో పాటు అవసరమైన చికిత్సలను ప్రభుత్వం ఉచితంగా చేయనుంది. ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ప్రజలు పోషకాహార లోపం, రక్తహీనతతో పాటు కంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారని తెలుస్తోంది. వీటిని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కంటి సమస్యల నివారణ లో భాగంగానే వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపకల్పన చేసింది . నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు వైఎస్సార్ కంటివెలుగు భాగంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు పరీక్షలు నిర్వహించి , చికిత్స అందించనున్నారు .
వైయస్సార్ కంటి వెలుగు లో భాగంగా మొదటి దశలో సుమారు 70 లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక నేత్ర పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షలు జరుగుతాయి. రెండవ దశలో కంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారిని గుర్తించి వారికి నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు విజన్ సెంటర్ లో పంపించే అవసరమైన చికిత్స చేసి , అవసరమైన వారికి కళ్ళద్దాలు క్యాటరాక్ట్ ఆపరేషన్లు ఇతర సేవలు ఉచితంగా అందిస్తారు.