ఏపీ సీఎం జగన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. వీరి కోసం ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్‌ ఏర్పాటుకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో దాదాపు లక్షమందికిపైగా అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఇప్పటివరకూ వీరు ఆయా ఏజెన్సీల ద్వారా రిక్రూట్‌ అవుతున్నారు. నియమాకాల్లో అందరికీ అవకాశాలు దక్కకపోవడం, పనికి తగినట్టుగా ఉద్యోగులకు చెందాల్సిన జీతం పూర్తిస్థాయిలో లభించకపోవడం, సకాలంలో జీతాలు రాకపోవడం లాంటి సమస్యలను అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు.


ఏజెన్సీలు నడుపుతున్నవారు తమకు నచ్చిన రీతిలో ఈనియామకాలను చేపడుతున్నారు. సాధారణ పరిపాలనాశాఖ ఆధ్వర్యంలో ఈ కార్పొరేషన్‌ పనిచేస్తుంది. కార్పొరేషన్‌కు అనుబంధంగా జిల్లాల స్థాయిలో విభాగాలు ఏర్పాటవుతాయి. జిల్లా ఇన్‌ఛార్జిమంత్రులు ఈ విభాగాలకు నేతృత్వం వహిస్తారు, జిల్లా కలెక్టర్లు కార్పొరేషన్‌కు ఎక్స్‌అఫీషియోలుగా వ్యవహరిస్తారు. రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రభుత్వ విభాగాలు తమకు కావాల్సిన సర్వీసులను కొత్తగా ఏర్పాటవుతున్న ఈ కార్పొరేషన్‌కు, దీనికింద జిల్లాల్లో ఉన్న విభాగాలకు నివేదిస్తాయి.


కార్పొరేషన్‌ లాభాపేక్ష లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇప్పటివరకూ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సేవలను వివిధ ఏజెన్సీలద్వారా ప్రభుత్వం పొందుతోంది. దాదాపు 1లక్ష మంది పనిచేస్తున్నారు. కొత్తగా ఏర్పాటవుతున్న కార్పొరేషన్‌ కారణంగా వీటికి చెక్‌పడనుంది. ఎలాంటి దళారీలు లేదా ఏజెన్సీలు లేకుండా నేరుగా ఈ కార్పొరేషన్‌ ద్వారా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను పొందే అవకాశం ఏర్పడుతుంది.


అంతేకాకుండా ప్రభుత్వంలోని వివిధ శాఖలు, విభాగాల్లో అవుట్‌ సోర్సింగ్‌ కింద పనిచేస్తున్న వారికి ఒకేపనికి ఒకే రకమైన జీతం లభిస్తుంది. ఈ ఉద్యోగులకు జీతాలచెల్లింపులో ఎలాంటి ఆలస్యం జరక్కుండా, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఆన్‌లైన్‌ద్వారా‡చెల్లించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఒక పోర్టల్‌ ద్వారా అవుట్‌సోర్సింగ్‌ నియామకాలను చేపడతారు. అక్టోబరు 16న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కార్పొరేషన్‌ ఏర్పాటుకు ఆమోదం తెలపనున్నారు. డిసెంబర్‌ 1 నుంచి కార్పొరేషన్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: