ఏపీ సీఎం వైఎస్ జగన్.. అనంతపురం జిల్లా పర్యటనలో సెంటిమెంట్ ఫీలయ్యారు. తాను అనంతపురం జిల్లా మనవడినని అంటూ ఆ జిల్లాతో అనుబంధం గుర్తు చేసుకున్నారు.తన తల్లి అనంతపురం జిల్లా ఆడపడుచు అంటూ గుర్తు చేసుకున్నారు. అనంతపురం జిల్లా అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హంద్రీనీవా కాలువను 6 వేల క్యూసెక్కులకు వెడల్పు చేస్తానని చెప్పారు.


అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని, గతంలో గుంటూరు ఆసుపత్రిలో ఎలుకలు కొరికిన ఘటనలు జరిగాయని గుర్తు చేశారు.ఏపీలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులన్నీ ప్రక్షాళన చేస్తామని పేర్కొన్నారు. జనవరి 1 నుంచి డయాలసిస్‌ పేషంట్లకు రూ.10 వేల పింఛన్‌ ఇస్తామన్నారు.తలసేమియా, డయాలసిస్‌ పేషంట్లకు ఆపరేషన్ల తరువాత విశ్రాంతి కోసం నెలకు రూ.5 వేలు ఇస్తామన్నారు. వైద్యరంగానికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని హామీ ఇచ్చారు. వైద్యం, చదువు, వ్యవసాయానికి పూర్తి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.


హంద్రీనీవా కాలువకు సమాంతరంగా మరో కాలువను నాలుగు వేల క్యూసెక్కుల సామర్ధ్యంతో నిర్మిస్తానని మాటిచ్చారు. మొత్తం 10 వేల క్యూసెక్కులు వచ్చేలా సమాంతర కాలువ నిర్మిస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చుతామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆసుపత్రుల ఫొటోలు తీసి నాడు- నేడు ఎలా ఉన్నాయో ప్రజలకు చూపుతామన్నారు.


ఏలూరు, మార్కాపురం, పులివెందుల పట్టణాల్లో కొత్తగా మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో మొత్తం 2 వేల వ్యాధులను చేరుస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీలో 2 వేల వ్యాధులు వర్తించేలా పశ్చిమ గోదావరి జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపికచేసినట్లు తెలిపారు. నవంబర్‌ 1వ తేదీ నుంచి హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలలో 150 ఆసుపత్రులను ఎంపిక చేసి ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి పెన్షన్లు ఇస్తామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: