16 సంవత్సరాల స్నేహం..ప్రేమగా మారింది. ఆ
ప్రేమ పెళ్లికి దారి తీసింది...ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో.. ఆ జంట ఒక్కటి కాబోతోంది. ఇలా చాలా మంది జీవితాల్లో జరిగే ఉంటుంది. మరి విశేషం ఏంటని అంటున్నారా.. ఆ విషయానికే వస్తున్న.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే చెందిన ఓ యువ ఎంపీ.. ఇలా పెళ్లికూతురుగా ముస్తాబవుతుండడమే ఇక్కడ ప్రత్యేకత. అరకు ఎంపీ గొట్టేటి మాధవి.. పెళ్లి కూతురయ్యారు.
ఎంపీగా గెలిచి.. ప్రజా జీవితంలో నిలదొక్కుకున్న ఆమె.. ఇప్పుడు వ్యక్తిగత జీవితంలోనూ విజయవంతమయ్యారు. తన పదహారేళ్ల ప్రేమను.. వివాహ బంధంగా మార్చుకోబోతున్నారు. ఎస్టీ థెరీసా విద్యాసంస్థల నిర్వాహకుడు కుసిరెడ్డి శివప్రసాద్ను మరో వారంలో
ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. ఐదో తరగతి నుంచి కలిసి చదువుకున్న ఈ ఇద్దరు.. మొదట ప్రాణ స్నేహితుల్లా మెలిగారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు.
వీళ్ల తల్లిదండ్రులూ స్నేహితులు కావడం.. ఇద్దరి బంధాన్ని ధృఢంగా మార్చింది.
మాధవి తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే గొట్టేటి దేముడు, శివప్రసాద్ తండ్రి కుసిరెడ్డి నారాయణ మూర్తి ఇద్దరూ మిత్రులు. ఇలా పరిచయమై స్నేహితులుగా మారిన మాధవీశివప్రసాద్... ప్రేమికులయ్యారు. ఒకరి కష్టాలను మరొకరు పంచుకున్నారు. ఒకరికొకరు అభిప్రాయాలు గౌరవించుకుంటూ.. తోడుగా, స్ఫూర్తిగా నిలిస్తూ.. జీవితంలో నిలదొక్కుకున్నారు. ప్రేమలోనే కాదు, ఉన్నత స్థానానికి చేరడంలోనూ విజయవంతమయ్యారు. బీఎస్సీ బీపీఈడీ చదివిన మాధవి.. ఒప్పంద పద్ధతిలో పీఈటీ టీచర్గా పనిచేశారు.
శివ ప్రసాద్.. ఎస్టీ థెరిసా విద్యా సంస్థల కరస్పాండెంట్గా,
శివ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్గా ఉన్నారు. అనూహ్యంగా ఈ ఏడాది జరిగిన ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి
మాధవి వచ్చారు.
రాజకీయ కురువృద్ధుడు
కిశోర్ చంద్రదేవ్ను అత్యధిక మెజారిటీతో ఓడించారు. రాష్ట్రంలో చిన్న వయసులోనే ఎంపీగా లోక్సభలో అడుగుపెట్టారు.
మాధవి తరఫున ఎన్నికల ప్రచార బాధ్యతలను
శివ ప్రసాద్ తీసుకుని ఆమె విజయానికి కారణమయ్యారు.ఈ క్రమంలో వీరిద్దరి మధ్య
ప్రేమ మరింతగా బలపడగా.. జంటగా ఒక్కటవ్వాలని నిశ్చయించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దల ముందు తమ పెళ్లి ప్రతిపాదన చేశారు. పెళ్లికి కులం అడ్డుగోడగా నిలిచినా... పెద్దలు తమ బాధ్యతను అర్థం చేసుకున్నారు. పిల్లల ఆలోచనను సమ్మతించారు. వారి వివాహ ప్రతిపాదనను అంగీకరించారు. ఈ నెల 17న అరకు ఎంపీ
మాధవి స్వగ్రామమైన... విశాఖ జిల్లా కొయ్యూరు మండలం శరభన్నపాలెంలో రాత్రి 3 గంటల 15 నిముషాలకు వివాహం జరగనుంది