ఇప్పుడు విమానయానం బాటలో రైల్వే శాఖ నడువబోతుందా.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర పభుత్వం కూడా రైల్వే శాఖను విమానయాన రంగం తరహాలో చేయబోతుందా.. దీనికి కేంద్ర ప్రభుత్వం అందుకు చర్యలు చేపట్టిందా అంటే అవుననే సమాధానాలు, కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు నిదర్శనంగా నిలుస్తుంది. ఇంతకు విమానయాన రంగం ఏమైంది.. దాని బాటలో భారతీయ రైల్వే రంగం ఎందుకు నడువబోతుంది. ఓసారి చూద్దాం.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం భారత రైల్వే శాఖను ప్రైవేటీకరణ చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది.
ఇటీవల తేజాస్ రైలును రైల్వే శాఖ ప్రవేశపెట్టిన అనంతరం తాజాగా మరో 150 రైళ్లను, 50 రైల్వే స్టేషన్లను దశలవారీగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని కేంద్రం గురువారం నిర్ణయించింది. ఇప్పటికే అనేక రైళ్ళను కేంద్రం ప్రైవేటుకు అప్పగించిందట. దక్షిణ మధ్య రైల్వేలోనూ కొన్ని రైళ్ళను, రైల్వే స్టేషన్లను ఇప్పటికే ప్రైవేటు పరం చేసిందట. ముందుగా కొన్ని సేవలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి వాటిని శాశ్వతంగా ప్రైవేటు కిందకు తీసుకువచ్చేందుకు సన్నహాలు చేస్తుందట. దీనికి కేంద్ర నిర్ణయం గురించి నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో స్పష్టం చేశారు.
ఈ ప్రక్రియను ముందకు తీసుకువెళ్లేందుకు సాధికార కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుందని లేఖలో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆరు విమానాశ్రయాల ప్రైవేటీకీరణ చేసింది. ఈ విమానాశ్రయాల అనుభవాన్ని ప్రస్తావిస్తూ రైల్వేల్లోనూ ఇదే తరహాలో ప్రైవేటీకరణ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు కార్యదర్శులతో కూడిన సాధికార కమిటీ ఏర్పాటవుతుందని రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్కు రాసిన లేఖలో అమితాబ్ కాంత్ తెలిపారు.
ప్రయాణీకుల రైళ్ల నిర్వహణను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించే ప్రక్రియతో ఈ రైళ్ల నిర్వహణలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయని పేర్కొన్నారు. ఇక దేశానికి అధిక ఆదాయం సమకూర్చే శాఖల్లో రైల్వే శాఖదే పెద్ద పీట. రైల్వే శాఖ బ్రిటీష్ కాలం నుంచి అతి తక్కువ ధరలకే ప్రయాణికులను, సరుకులను రవాణా చేస్తూ కీర్తిని గడించింది. అయితే ఇప్పుడు దేశంలోని పెద్ద సంస్థగా ఉన్న రైల్వేను ప్రైవేటీకరణ చేస్తే ఇక ఇది సామాన్యుడి బతుకుకు భారంగా మార్చేయనుంది.