మనం బంగారం స్మగ్లింగ్ చేయడం చూసాము.. విదేశీ కరెన్సీ అక్రమంగా తరలించడం విన్నాం.. డ్రగ్స్ను రకరకాలైన పద్దతుల్లో దేశాలకు దేశాలు దాటించడం చూసాము.. విలువైన ఎర్రచందనం కలపను స్మగ్లింగ్ చేస్తుంటే చూస్తున్నాం.. ఇంకా చెప్పాలంటే సముద్ర తాబేళ్ళను, స్టార్ తాబేళ్ళను అక్రమంగా తరలించడం కన్నాం.. విన్నాం.. చూసాం.. కానీ ఇలాంటి స్మగ్లింగ్ను మాత్రం చూసి ఉండము.. ఇలాంటివి కూడా స్మగ్లింగ్ చేస్తారా... వాటిని చూస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది. అలాంటిది దేశం కాని దేశం నుంచి విమానంలో దర్జాగా, ఎలాంటి జంకు గొంకు లేకుండా, కనీసం భయం లేకుండా చాలా భద్రంగా ఇండియాకు తీసుకొచ్చారు.
ఇంతకు ఇలాంటి వాటిని కూడా స్మగ్లింగ్ చేస్తారనే విషయమే ఇప్పటి వరకు తెలియదు.. కానీ ఇప్పుడు ఈ స్మగ్లింగ్ చూసి నోరేళ్ళ బెట్టడం కస్టమ్స్ అధికారుల వంతైంది.. ఇంతకు స్మగ్లర్లు వేటిని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారో ఓసారి చూద్దాం.. ఇద్దరు కేటుగాళ్లు ప్రమాదకరమైన విష సర్పాలను, ఉడుములను సైతం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్టారు. చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో విష సర్పాల స్మగ్లింగ్ బాగోతం బట్టబయలైంది. గురువారం మలేసియా నుంచి చెన్నై విమానాశ్రయానికి వచ్చారు. అయితే వీరి వ్యవహరిస్తున్న తీరును గమనించిన కస్టమ్స్ అధికారులు ఎందుకో వీరిని తనిఖీ చేశారు.
ఇద్దరి వద్ద ఉన్న ప్లాస్టిక్ బాక్సులను ఓపెన్ చేయగానే తనిఖీ అధికారులు షాక్తో గజగజ వణికి పోయారు. వీరి వద్ద ఉన్న బాక్స్లో ఉన్నవి విష సర్పాలు, ఉడుములు. స్మగ్లర్ల వద్ద నున్న ఆ బాక్సుల్లో భయంకరమైన 2 పాము పిల్లలు, 16 ఉడుములు ఉన్నాయి. వీటిని చెన్నై రామనాథంపురం ప్రాంతానికి చెందిన మహ్మద్(36), శివగంగేకు చెందిన మహ్మద్ అక్బర్ (26) అనే వ్యక్తులు పాము పిల్లలు, ఉడుములతో ఉన్న బాక్సులను అతి జాగ్రత్తగా తీసుకు వచ్చారు. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ విష సర్పాలు ఎందుకు ఇండియాకు తీసుకొచ్చారు ? వీటితో ఏమి చేయదలుచుకున్నారు ? ఎక్కడినుంచి వీటిని తెచ్చారు అని కూపీ లాగుతున్నారు. అయితే ఈ పాములను, ఉడుములను తిరిగి మలేసియాకు పంపనున్నట్టు అధికారులు తెలిపారు. ఇంతకు వీరు ఈ విష సర్పాలను ఎందుకు తీసుకొస్తున్నట్లు, దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా.. లేక కస్టమ్ అధికారులను దారి మళ్ళించేందుకు ఇలా ఎత్తుగడ వేశారా.. అనేది విచారణలో తేలనున్నది.