తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వారం రోజులైంది. ఆర్టీసీ కార్మికులు గత నెల రోజుల నుంచే తెలంగాణ సర్కారుకు తమ హక్కుల కోసం సమ్మె నోటీసులు ఇస్తూనే ఉన్నారు. అయినా తెలంగాణ సర్కారు నిమ్మకు నీరేత్తినట్లుగా ఉండటంతో
దసరా పండుగ సమయంలోనే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడం ప్రారంభించారు. దీంతో సమ్మె ఎఫెక్ట్ ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడింది. దసరా పండుగ సందర్భంగా ప్రజలు తమ సొంతఊళ్లకు వెళ్లేందుకు సమాయత్తం కావడం, ఇంతలోనే ఆర్టీసీ సమ్మె ప్రారంభం కావడంతో ఇక ప్రజల జేబులకు చిల్లుపడిపోయింది.
ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ తో బస్సులన్ని డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు రోడ్డెక్కకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ బస్సులు, ట్యాక్సీలు, ఆటోలపైనే కాకుండా విమానాలు అనుకూలంగా ఉన్న చోట వాటిని ఆశ్రయించారు. అయితే దసరా పండుగ ముగించుకుని తిరిగి ప్రయాణం అయ్యె ప్రయాణికులు ఇప్పుడు ప్రైవేటు బస్సులను, ట్యాక్సీలను, రైళ్ళను, ఆటోలను, క్యాబ్లను చివరికి విమానాలను కూడా ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇప్పుడు అన్ని వాహనాల్లో ప్రయాణికులను అధిక చార్జీలతో బాదేస్తున్నారు.
ఇప్పుడు చివరికి విమానంలో ప్రయాణం చేసే ప్రయాణికులపై కూడా అధిక ఛార్జీ భారం పడింది.. ఆర్టీసీ సమ్మె పుణ్యమా అని ఇప్పుడు విమాన ఛార్జీలకు రెక్కలొచ్చాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె, రైళ్లన్నీ పుల్ అవడంతో విమాన ప్రయాణాలకు
దసరా పండుగ డిమాండ్ పెరిగింది. నాలుగు అంకెల్లో ఉండాల్సిన విమాన ఛార్జీలు ఐదు అంకెలకు పెరిగాయి. అంటే సాధారణ ఛార్జీల కంటే పది రెట్లు పెరిగాయి. ముఖ్యంగా ఏపీ నుంచి హైదరాబాద్కు వచ్చే విమాన టికెట్ ధరలు అమాంతం పెరిగాయి. ముంబై నుంచి హైదరాబాద్కు ఫ్లైట్ టికెట్ రూ.2,177 అయితే అది ఇప్పుడు రూ.3 వేలుగా ఉంది.
ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చే ఫ్లైట్ టికెట్లు కూడా రూ.4 వేలుగా ఉంది. అందుబాటులో ఉన్న బస్సుల్లో, రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉండడం.. ప్రైవేట్ ట్రావెల్స్ అందినకాడికి దోచుకునే ప్రయత్నాల్లో ఉంటే.. దీనికంటే విమాన ప్రయాణం బెటర్ అనుకుంటే. అక్కడ కూడా అదే పరిస్థితి నెలకొంది. తెలంగాణ సర్కారు, ఆర్టీసీ కార్మికులు పట్టువిడుపుతో వ్యవహరించి సమ్మెపై ఓ నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ బాదుడు తప్పేలా లేదు.. ఇకనైనా సమ్మెపై ప్రభుత్వం ఓ అడుగు ముందుకు వేసి కార్మికుల సమస్యలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు..